
మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. దాయాది పాకిస్థాన్పై మరోసారి ఆధిపత్యాన్ని చూపింది.
పాకిస్థానే అత్యుత్తమ జట్టు:
ఈ హై ఓల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ బ్యాటర్లను భారత బౌలర్లు ఏమాత్రం కోలుకోనివ్వలేదు. తెలుగమ్మాయి శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత బౌలర్ల దాటికి పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18.1 ఓవర్లలోనే ముగిసింది. పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా.. ఏ బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అయితే ఈ ఘోర ఓటమి తర్వాత పాకిస్థాన్ మహిళల జట్టు కోచ్ వహాబ్ రియాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్ చేతిలో ఇంతటి ఘోర పరాజయం ఎదురైనప్పటికీ.. ప్రస్తుత ఆసియా కప్లో టైటిల్ గెలిచే సత్తా ఉన్న అత్యుత్తమ జట్టు పాకిస్థానే అని పేర్కొన్నాడు.
తప్పకుండా కప్ కొడుతాం:
‘మా జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్లో అద్భుత నైపుణ్యం ఉంది. వారు తమపై తాము నమ్మకం ఉంచాల్సిన అవసరం వచ్చింది. మా తదుపరి మ్యాచ్ హాంకాంగ్తో ఉంది. భారత్తో మ్యాచ్లో ఎక్కడ తప్పులు చేశామో చర్చిస్తాం. ఆ తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం. ఈ ఆసియా కప్లో ట్రోఫీ గెలిచే అత్యుత్తమ జట్టు పాకిస్థానే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా కప్ కొడుతాం’ అని వహాబ్ రియాజ్ ధీమా వ్యక్తం చేశాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మార్పులు చేశాం:
అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా వహాబ్ రియాజ్ స్పందించాడు. ఆసియా కప్ కోసం జట్టులో భారీగా మార్పులు చేయడాన్ని సనా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే సనా అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని వహాబ్ స్పష్టం చేశాడు. ‘సనాకు తన సొంత అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జట్టులో మార్పులు చేశాం. గతంలో ఆడిన ఆటగాళ్లు ఎన్నో ప్రపంచ కప్లు, ఆసియా కప్లు ఆడారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే కొత్త వారికి అవకాశం ఇచ్చి.. రాబోయే టోర్నీల కోసం జట్టును బలంగా నిర్మించాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పాడు.
అమ్మాయిలు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు:
‘ఎవరిని జట్టు నుంచి తప్పించామన్నది ముఖ్యం కాదు. వాస్తవ పరిస్థితులను చూడాలి. జట్టు నుంచి తప్పించిన అమ్మాయిలు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు. అందుకే కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం సరైన నిర్ణయమే అని నేను భావిస్తున్నాను’ అని వహాబ్ రియాజ్ పేర్కొన్నాడు. భారత్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మహిళల ఆసియా కప్లో పాకిస్థాన్ ప్రయాణం అక్కడితోనే ముగిసే అవకాశం ఉంది.