Reading Time: < 1 minute
Ktr Demands Cancellation Of Go 97 Polytechnic Colleges Skill University

పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ హయాంలో సాంకేతిక విద్యకు పెద్దపీట

మల్టీ డిసిప్లినరీ కోర్సులు, అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. “తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు అనేక కొత్త కోర్సులను తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు, స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాం” అని ఆయన పేర్కొన్నారు.

హామీలను గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. “రూ. 5 లక్షల విద్య భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారు. పదో తరగతి పాసైతే రూ. 10 వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ. 15 వేలు ఇస్తామన్న హామీలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములను అమ్మేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడతాం

విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అగ్రహారం కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థులకు అండగా నిలబడాలని కోరారు. ఒకవేళ విద్యార్థులను ఎవరైనా బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులుగానీ, అధికారులుగానీ బెదిరింపులకు పాల్పడితే వెంటనే బీఆర్‌ఎస్‌వీ (BRSV) నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. “రెండేళ్లు ఓపిక పట్టండి, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుంది” అని విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.