
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్లోని సహరాన్పూర్లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదును యోగి సర్కార్ శనివారం కూల్చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు బుల్డోజర్ యాక్షన్ ప్రారంభైంది. దీంతో ఎస్పీ నేత అమీక్ జామీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అమీక్ జామీ మాట్లాడుతూ.. ‘‘గాజాలో లాగా మసీదులు బలవుతున్నాయి. ఒక ముస్లింగా నేను అవమానంగా భావిస్తున్నాను. మమ్మల్ని పరాయివారిగా చూసేలా చేస్తున్నారు’’ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో గాజాలో జరిగినట్లుగా మన ప్రార్థనా స్థలాలు, మసీదులు కూలిపోతున్నాయని, మనకు చట్టపరమైన అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఈ దేశపు మట్టి కోసం రక్తం ధారపోయడంలో మా తప్పేముంది? అని ప్రశ్నించారు. హిందువులు మసీదుల నిర్మాణానికి సహాయపడిన, ముస్లింలు దేవాలయాల కోసం భూములు దానం చేసిన దేశంలో బీజేపీ సమాజాన్ని విభజించి ఎందుకు విషపూరితం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలా చేస్తుందని ఆరోపించారు.
మసీదుపై చర్యల తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ ఓడిపోతేనే అన్నీ సర్దుకుంటాయని అన్నారు. ఇతర మతాలను గౌరవించని వారు ఎఫ్పటిని నిజమైన సనాతన వ్యక్తులు కాలేరని, నిజమైన హిందువు మరొకరిని ఎన్నడూ అవమానించడని అన్నారు. రామ మందిరంలో దొంగతనం చేస్తూ పట్టుబడటం వల్లే వీళ్లు ఇలా చేస్తున్నారు అని అన్నారు. సిట్ ఏర్పాటు, జైలు శిక్షల వల్ల వారు సర్వం కోల్పోయారని అన్నారు. ఇంకా 100 రోజులే మిగిలి ఉన్నాయని బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.