
ఎస్ఆర్సీసీ నుంచి బయటకు వచ్చిన వారంతా గొప్పవాళ్లు కాకపోవచ్చు.. కానీ వాళ్లు చాలా సంచలనం సృష్టించారని శత వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీఅన్నారు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో మోడీ పాల్గొని ప్రసంగించారు. సంస్థకు వందేళ్లు నిండినప్పుడు.. అది విజయాలకు, స్ఫూర్తికి సముద్రంగా మారుతుందని అన్నారు. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎస్ఆర్సీసీ తరతరాలను ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు.
‘‘ఒక సంస్థకు వందేళ్లు నిండినప్పుడు.. అది విజయాలకు, స్ఫూర్తికి సముద్రంగా మారుతుందని ప్రధాని అన్నారు. తన 100 ఏళ్ల ప్రస్థానంలో ఎస్ఆర్సీసీ తరతరాలను ఉజ్వల భవిష్యత్తుకు అనుసంధానించింది. దర్యాగంజ్లోని ఒక చిన్న ప్రదేశంలో ప్రారంభమైన దీని ప్రస్థానం. ఇప్పుడు ఎన్నో తరాలకు నీడను ఇచ్చే ఒక మహావృక్షంగా ఎదిగింది.’’ అన్నారు. ‘‘అరుణ్ జైట్లీ కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఎస్ఆర్సీసీకి సంబంధించిన ఏదో ఒక సంఘటనను గుర్తుచేయని సమావేశం దాదాపుగా ఉండేది కాదని నేను చెప్పగలను. ఇక్కడి నుంచే ఎందరో కళాకారులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు ఎదిగారు. ఎస్ఆర్సీసీ సభ్యులు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు.’’ అని అన్నారు.
‘‘ప్రజలు నా 2013 ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో మీ స్థానాల్లో మీ సీనియర్లు ఇక్కడ కూర్చున్నారు. నేను కూడా దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సభ్యుడినే. ఆ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంపై నేను ఆరోపణలు చేస్తానని అందరూ ఊహించారు, కానీ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ.. నేను ఈ వేదికను ఉపయోగించుకోలేదు. నాకు ఒక దార్శనికత ఉంది. నేను సానుకూలంగా మాట్లాడాను. నేను అదే మార్గంలో కొనసాగుతున్నాను.’’ అని పేర్కొన్నారు.