
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను పార్టీ జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించారు. ఆకాశ్ ఆనంద్కు ఇంకా మరింత రాజకీయ పరిణతి, అనుభవం అవసరమని.. అందుకే ప్రస్తుతం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడం లేదని మాయావతి తెలిపారు. అయితే ఆకాశ్ ఆనంద్ బీఎస్పీలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి కీలక సంస్థాగత బాధ్యతలు ఇవ్వబోమని పేర్కొన్నారు.
ఆకాశ్ ఆనంద్కు మరోసారి ఎదురుదెబ్బ
ఆకాశ్ ఆనంద్కు పార్టీలో పదవి దక్కడం, ఆ తర్వాత కీలక బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇటీవలి కాలంలో పలుమార్లు జరిగింది. తాజాగా జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా మారింది. మాయావతి గతంలోనూ ఆకాశ్ ఆనంద్ను పార్టీ కీలక పదవుల నుంచి తప్పించారు. అనంతరం తిరిగి బీఎస్పీ సంస్థాగత వ్యవస్థలోకి తీసుకొచ్చారు. తాజా నిర్ణయంతో 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో ఆకాశ్ ఆనంద్ పాత్రపై మరోసారి చర్చ మొదలైంది.
‘మరింత రాజకీయ పరిణతి అవసరం’
ఆకాశ్ ఆనంద్కు ఇప్పటికీ మరింత రాజకీయ పరిణతి, అనుభవం అవసరమని మాయావతి పేర్కొన్నారు. పెద్ద బాధ్యతలు అప్పగించే ముందు రాజకీయంగా మరింత అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరం కాబోరని స్పష్టం చేశారు. బీఎస్పీలోనే కొనసాగుతూ పార్టీ కోసం పనిచేస్తారని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఎస్పీ తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే గురువారం లక్నోలో పార్టీ జాతీయ స్థాయి నేతల సమావేశం జరిగింది. ఈ సమయంలోనే ఆకాశ్ ఆనంద్ను జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పిస్తూ మాయావతి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి.