
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 275 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు నేపాల్లో 166 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. గల్లంతైన వారిని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు భారతదేశంలోని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఇప్పటివరకు 166 మంది భారతీయులను నేపాల్లో రక్షించినట్లు ఆయన వెల్లడించారు. రక్షించిన భారతీయుల పేర్లను విదేశాంగ ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని చెప్పారు. సహాయక చర్యల్లో నేపాల్ అధికారులు చేస్తున్న కృషిని భారత్ అభినందిస్తోందని పేర్కొన్నారు. చైనా నుంచి 1,907 మంది భారతీయులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లో భారతీయ ప్రయాణికులు ఎవరూ చిక్కుకుపోలేదని స్పష్టం చేసింది. చైనా అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. టిబెట్ అటానమస్ రీజియన్లో భారతీయ ప్రయాణికులు ఎవరూ చిక్కుకుపోలేదని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
నేపాల్, టిబెట్లో సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరో 5,600 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదు. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. దేశంలో 1,287 మంది మృతి చెందగా, 5,083 మంది గల్లంతయ్యారు. టిబెట్లో 21 మంది మరణించగా, 541 మంది గల్లంతైనట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. రెండు ప్రాంతాల గణాంకాలను కలిపితే మొత్తం 1,308 మంది మృతి, 5,624 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో ట్రెక్కింగ్కు వెళ్లినవారు, యాత్రికులు సహా 800 మందికి పైగా విదేశీయులు కూడా గల్లంతైనట్లు సమాచారం.
9 రోజుల తర్వాత సజీవంగా..
వరదలు, కొండచరియలు, మట్టి, రాళ్ల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్లోని త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర ఓ సొరంగంలో తొమ్మిది రోజులుగా చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులను సజీవంగా గుర్తించి రక్షించారు. సంజయ షా, కబీర్ మహర్జన్ అనే ఇద్దరిని సొరంగం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే సొరంగ మార్గాల్లో మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని నేపాల్ ఆర్మీ కల్నల్ ఝబీంద్ర రేష్మి తెలిపారు. నీటిని తొలగించడంతో పాటు పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తూ.. మరెవరైనా సజీవంగా ఉన్నారా అనే కోణంలో గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
ఆగస్టు 26న ప్రారంభమైన విపత్తు
నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో ఆగస్టు 26న మంచు పొరలు లేదా హిమనదీ ప్రాంతం కూలిపోవడంతో భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి నదీ వ్యవస్థలోకి ప్రవహించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వరద ప్రవాహం లోయల గుండా నేపాల్, టిబెట్ ప్రాంతాలకు చేరుకుని భారీ విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో ఇళ్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా త్రిశూలి నది లోయ అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది.
భారత్ భారీగా సహాయం
నేపాల్లో సహాయక చర్యలకు భారత్ తన మద్దతును కొనసాగిస్తోంది. భారత్ పంపిన ఐదో సహాయక విమానం 11 మంది సభ్యులతో కూడిన రెస్క్యూ బృందం, ప్రత్యేక పరికరాలు, 5.5 టన్నుల వైద్య సామగ్రిని నేపాల్కు తీసుకెళ్లింది. భారత రెస్క్యూ బృందాలు నేపాల్ అధికారులతో కలిసి సహాయక, పునరావాస చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలింపు, మృతదేహాల వెలికితీత వంటి చర్యల్లోనూ భారత బృందాలు సహకరిస్తున్నాయి.