
భారత ప్రైమరీ మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. యూఎస్-ఇరాన్ యుద్ధ పరిణామాల కారణంగా 2026 ప్రారంభంలో నెమ్మదించిన నిధుల సేకరణ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంది. సెప్టెంబర్ 9న ఒకే రోజున రికార్డు స్థాయిలో ఆరు ఐపీఓలు (IPOs) మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. ఫర్నీచర్ రెంటల్ వేదిక రెంట్ ఒమోజో, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా), మణిపాల్ పేమెంట్ & ఐడెంటిటీ సొల్యూషన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు కంపెనీలు కలిపి సుమారు 45.11 బిలియన్ రూపాయలు (477.46 మిలియన్ డాలర్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే వారంలోనే మరికొన్ని ఇతర కంపెనీలతో కలిపి కనీసం 11 ఐపీఓలు మార్కెట్లోకి అడుగుపెడుతుండటంతో ఈ ఏడాదిలోనే ఇది అత్యంత రద్దీగా ఉండే వారంగా నిలవనుంది.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అంచనాల ప్రకారం.. సెప్టెంబర్ నెలలో మొత్తం మీద దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఓలు రానున్నాయి. ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ హీరో మోటార్స్, ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE లతో పాటు ముకేష్ అంబానీ మద్దతు ఉన్న జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ కూడా త్వరలోనే రాబోతోంది. అధిక వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది.
ఈ ఏడాది ఆగస్టు 26 నాటికి భారత్లో 165 ఐపీఓల ద్వారా 8.61 బిలియన్ డాలర్లు సమీకృతమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఐపీఓ నిధుల సేకరణలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ ఇచ్చే ఐపీఓ అనుమతుల గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కంపెనీలు మార్కెట్లోకి వచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సగటున 24.5 రెట్లు ఉన్న ఐపీఓ సబ్స్క్రిప్షన్లు, జూలై-ఆగస్టు నాటికి 59.1 రెట్లకు పెరిగాయి. అలాగే లిస్టింగ్ లాభాలు కూడా 5.7 శాతం నుంచి 19.5 శాతానికి పైగా పుంజుకున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడిదారులు ప్రతి ఐపీఓలోనూ కాకుండా నాణ్యమైన, మంచి వృద్ధి సామర్థ్యం ఉన్న కంపెనీల్లో మాత్రమే జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతున్నారు.