
‘ఎపిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య గతం తాలూకు ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను ఒకరు “అసలు నువ్వెవరు? నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? గూగుల్లో నీ పేరు టైప్ చేస్తే నీ గురించి ఏమైనా వస్తుందా?” అని అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను సాధించింది ఏమీ లేకపోవడంతో ఆ మాటలు తనను లోపల ఎంతగానో బాధపెట్టాయని ఆమె అన్నారు. కానీ ఇప్పుడు గూగుల్కి వెళ్లి ‘వైష్ణవి చైతన్య’ అని టైప్ చేస్తే ఒక అమ్మాయి, ఆమె కథ, ఆమె సినిమాలు, ఆమె ప్రయాణం కనిపిస్తాయని, ఇదే తన జీవితంలో అసలైన ‘ఎపిక్ మూమెంట్’ అని వైష్ణవి స్పష్టం చేశారు. సహనటుడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ‘బేబీ’ సినిమా నుంచి ఆయన తనకు తెలుసని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వ్యక్తిత్వంలో కన్సిస్టెన్సీ ఏమాత్రం మారలేదని ప్రశంసించారు. పక్కన నటించే వారు నాచురల్ గా పెర్ఫార్మ్ చేయడానికి ఆనంద్ ఎంతో ఫ్రీడమ్ ఇస్తారని, అలాగే తన తోటి వారు ఎదుగుతుంటే జెన్యూన్ గా సంతోషపడే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతమని కితాబిచ్చారు.
ఈవెంట్ కు విచ్చేసిన రష్మిక మందన్న ప్రయాణం తనలాంటి ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని వైష్ణవి కొనియాడారు. నేషనల్ క్రష్ నుంచి నేషనల్ స్టార్ స్థాయికి ఎదిగిన ఆమె.. ఇతరుల్లా కాకుండా మనలోని యూనిక్ టాలెంట్ ను గుర్తించి దానినే బలంగా మలుచుకుని ఎలా ఎదగాలో నిరూపించారని అన్నారు. సితార ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా చేయడం, ముఖ్యంగా తనను నమ్మి భారీ ఖర్చుతో యూకే పంపించడం పట్ల నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు ఆదిత్య తనకు డైరెక్టర్ మాత్రమే కాదని, ఒక బెస్ట్ ఫ్రెండ్ అని వైష్ణవి తెలిపారు. ఇంటర్వ్యూల సమయంలో తాను నర్వస్ గా ఫీల్ అవుతుంటే ఆదిత్య తనకు అండగా నిలబడి ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ అజీమ్ చిన్న స్పేస్ లో కూడా ఎంతో క్రియేటివ్ గా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ సెట్ చేశారని మెచ్చుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఆత్మను తాకేలా ఉంటుందని, గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని పాట తనకు మోటివేషన్ ఇస్తుందని, ఈ చిత్రంలోని ‘యాల యాలో’ పాటతో పాటు అన్నీ అద్భుతంగా వచ్చాయని ఆమె తెలిపారు.
ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతోందని వైష్ణవి వెల్లడించారు. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి.