Reading Time: < 1 minute
Baswaraju Saraiah Challenges Konda Surekha To Contest Independently

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్సీ బస్వరాజు.. కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు సవాల్ విసురుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. తాను కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజల మద్దతు ఎవరి వైపు ఉందో ఎన్నికల ద్వారా తేల్చుకుందామని బస్వరాజు వ్యాఖ్యానించారు.

కొండా సురేఖపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.. ఇన్ని సంవత్సరాలు ప్రజల రక్తం తాగిన మీరు ఇప్పుడు బీసీ కార్డును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నాళ్లు బీసీ కార్డును వాడుకుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే తాను ఊరుకోబోనని హెచ్చరించారు. కొండా సురేఖపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. బ్లాక్‌మెయిల్ కల్చర్‌కు పాల్పడేది మీరేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో చోటుచేసుకున్న పలు ఘటనలను ప్రస్తావిస్తూ బస్వరాజు సారయ్య ప్రశ్నలు సంధించారు. 250 మూగజీవాలను కాల్చింది ఎవరు?, కాలిపోయిన స్థలం ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది? అంటూ ప్రశ్నించారు. ఈ సవాల్‌పై కొండా సురేఖ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.