
Bollaram: హైదరాబాద్ మహానగరంలోని బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో డిటోనేటర్లు కలకలం రేపాయి. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో భారీగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. గోల్ఫ్ ఎన్క్లేవ్ వెంచర్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్లాస్టిక్ బకెట్ను గుర్తించిన ఆర్మీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బకెట్ను పరిశీలించారు. లేత ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్ బకెట్లో మొత్తం 8 బండిల్స్లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బండిల్లో 20 డిటోనేటర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.32 వేలుగా ఉన్నట్లు సమాచారం.
డిటోనేటర్లు గుర్తించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలిలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు మల్కాజిగిరి బాంబ్ డిస్పోజల్ టీమ్కు సమాచారం అందించారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని ప్రత్యేక జాగ్రత్తలతో తనిఖీలు చేపట్టింది. బాంబ్ డిస్పోజల్ టీమ్ సభ్యులు డాగ్ రుద్రతో కలిసి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డిటోనేటర్లు అక్కడికి ఎలా వచ్చాయి? వాటిని ఎవరు తీసుకొచ్చి అక్కడ ఉంచారు? వాటిని ఏదైనా నిర్మాణం లేదా ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు తీసుకొచ్చారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ క్యాంపు, ఫైరింగ్ రేంజ్ సమీపంలో డిటోనేటర్లు లభించడంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. డిటోనేటర్లకు సంబంధించిన ఆధారాలు, వాటి మూలం, వాటిని అక్కడ ఉంచిన వ్యక్తుల వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.