
Pakistan Hindu Temple Demolition Row: దాదాపు 100 ఏళ్ల పురాతన హిందూ దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారన్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. ఆలయ భవనాన్ని ఎవరూ కూల్చివేయలేదని, జూలై 21న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయ నిర్మాణం దెబ్బతిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది. భారత్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో పాకిస్థాన్ తాజాగా తన వివరణ ఇచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయానికి సంబంధించినది. సమీపంలోని మదర్సా కోసం ఆలయ భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతో మత ఛాందసవాదులు ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని స్థానిక నివాసితులు, మైనారిటీ సంస్థలు, ఓ రాజకీయ పార్టీ ఆరోపించాయి.
ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆలయ కూల్చివేత ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిస్సందేహంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, దెబ్బతిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. పాకిస్థాన్లోని మైనారిటీ పౌరుల భద్రతను నిర్ధారించడంతో పాటు వారి మత, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
భారత్ అభ్యంతరాల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం శుక్రవారం తన వాదనను వెల్లడించింది. ఆలయ భవనం కూల్చివేతకు ఎలాంటి ఉద్దేశపూర్వక చర్య కారణం కాదని, జూలై 21న కురిసిన భారీ వర్షాల వల్ల నిర్మాణం దెబ్బతిందని తెలిపింది. స్థానిక అధికారులు ఇప్పటికే వర్షాల వల్ల ఆలయానికి జరిగిన నష్టాన్ని సర్వే చేసినట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఆలయ భవనాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో ఆలయ కూల్చివేతపై భారత్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ అధికారికంగా తోసిపుచ్చినట్లైంది.