Reading Time: < 1 minute
Tilak Varma South Zone Duleep Trophy 2026 Final

భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో సౌత్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి, శతకం, అర్ధశతకంతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది. దాదాపు 55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రెండు జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ జరగడం విశేషం.

తిలక్ వర్మ దులీప్ ట్రోఫీ ఫైనల్‌తో పాటు సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లోనూ ఆడాలని పట్టుదలతో ఉన్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత రెండు రోజులు వ్యవధి ఉండటంతో, సెప్టెంబర్ 11న టీమ్‌కు రిపోర్ట్ చేసి, 12న ప్రాక్టీస్ పూర్తి చేసుకుని తొలి టీ20లో బరిలోకి దిగవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉందన్నారు.

తన క్రికెట్ ప్రయాణం గురించి తిలక్ వర్మ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే రెడ్ బాల్ క్రికెట్ ఆడటం తన కల అని స్పష్టం చేశారు. ఐపీఎల్ లో రాణించడం ద్వారా భారత్ తరఫున టీ20, వన్డే మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చినప్పటికీ, టెస్టు క్రికెట్ ఆడటమే తన అసలు లక్ష్యమని తెలిపారు. పదేళ్ల వయస్సు నుంచే రెడ్ బాల్ క్రికెట్ కోసం ఎంతో కష్టపడ్డానని, టెస్టు క్రికెట్ ఆడాలనే తపన ఎప్పుడూ తన రక్తంలోనే ఉందన్నారు. ఇప్పటివరకు భారత్ తరఫున 53 టీ20లు, 5 వన్డేలు ఆడిన తిలక్, సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా జాతీయ జట్టుకు ప్రతిభ చాటాలని ఆశిస్తున్నారు.