Reading Time: 2 minutes
Andhra Pradesh: నూనెతో జారే రాళ్లపై పూనకంతో దిగే పూజారి.. గంప మల్లయ్య స్వామి పూజ రహస్యం ఇదే..

అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం చిన్నజలాల, తరిమెల గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ గంప మల్లయ్య స్వామి కొండ ఉంది. తిరుమల తరహాలోనే ఏడు కొండలు దాటి సుమారు 11 కిలోమీటర్లు కాలినడకన అడవి గుండా వెళ్తేగానీ ఈ కొండపైకి చేరుకోలేము. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఈ కొండపైకి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అటవీ మార్గంలో ఎత్తైన కొండలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ సాహసోపేతంగా నడిచి కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను దర్శించుకుంటారు. ​కొండపై ఉత్సవ విగ్రహాల వద్ద భక్తులు తెచ్చిన ఆముదం నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఆ ఆముదం నూనె అంతా ప్రవహించి, కొండ కింద 30 అడుగుల లోతులో ఉన్న గుహకు వెళ్లే బండరాళ్లపై పడుతుంది.

​స్వామివారి అసలు విగ్రహం లోతైన ఆ గుహలోనే ఉంటుందని నమ్ముతారు. నూనె చల్లి ఉన్న ఆ జారుడు బండరాళ్లపైకి సామాన్య భక్తులు వెళ్లడం అసాధ్యం.
​పూజారి మాత్రమే ఒక చేతితో హారతి పళ్లెం, మరో చేతితో గంట పట్టుకుని, మెడలో భక్తుల ముడుపుల మూట వేసుకుని, భక్తుల గోవింద నామస్మరణ, వాయిద్యాల శబ్దాల మధ్య పూనకం వచ్చినట్లు ఆ జారుడు రాళ్లపై నుంచి గుహలోకి దిగుతారు. ​గుహలోకి వెళ్లి స్వామికి హారతి ఇచ్చి, ముడుపులు సమర్పించి తిరిగి ప్రాణాలను పణంగా పెట్టి కొండపైకి వచ్చి భక్తులకు ఆ హారతిని ఇస్తారు. గుహలో పూజారికి తప్ప ఇతరులకు దేవుని దర్శనం లభించదు.

​ఆగస్టు 2021 శ్రావణ మాసంలో ప్రాణాలకు తెగించి పూజలు చేసే అప్పా పాపయ్య అనే పూజారి, కొండపై హారతి ఇచ్చే క్రమంలో నూనె చారలున్న బండపై నుంచి కాలుజారి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ​ఈ ప్రమాదం తర్వాత అధికారులు, పోలీసులు భక్తుల, పూజారుల భద్రత దృష్ట్యా కొండ లోయలోకి దిగి హారతి ఇచ్చే సాహస పూజలపై ఆంక్షలు విధించారు. ​భక్తుల విశ్వాసాలు, సాంప్రదాయాల ప్రకారం కొన్ని నిబంధనలతో, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితమైన పద్ధతిలో పూజా కార్యక్రమాలను తిరిగి కొనసాగిస్తున్నారు.

​ఇక్కడి ప్రజలు గంప మల్లయ్య స్వామిని శ్రీ వేంకటేశ్వర స్వామివారి మరో అవతారంగా భావిస్తారు. భక్తులు తమను చల్లగా చూడాలని స్వామివారిని వేడుకుంటే, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు పూజారి తన ప్రాణాలనే పణంగా పెట్టి ఈ పూజలు నిర్వహిస్తారు. నూనె చల్లి జారుడుగా మారిన రాళ్లపై అడుగు వేయడమంటే మృత్యువుతో చెలగాటమాడటమే. గతంలో ఈ క్రమంలో కాలుజారి పూజారి పాపయ్య మృతి చెందిన సంఘటనలు ఉన్నప్పటికీ, తరతరాలుగా వస్తున్న ఈ అనాది సంప్రదాయాన్ని, భక్తుల విశ్వాసాన్ని పూజారులు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గుహ పూజ స్వామివారి దైవశక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.

వీడియో చూడండి..