Reading Time: 2 minutes
Trump Iran War End Midterm Elections Senior Aides Meeting

అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నికలు విజయం సాధించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఆలోచిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు సీనియర్ సహాయకులతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించినట్లు ప్రకటించాలా? లేదా సైనిక చర్యలను కొనసాగించాలా? అనే అంశంపై చర్చిస్తున్నారు.

అయితే ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించే అంశంపై ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించి ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ వ్యక్తిగతంగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆర్థిక ఆంక్షలు, ఒత్తిడిని కొనసాగిస్తే టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా చేయవచ్చని.. లేదంటే చివరకు ఇరాన్ పాలక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆరు నెలల క్రితం అమెరికా ఇరాన్‌పై సైనిక చర్య ప్రారంభించింది. తొలుత ఈ ఆపరేషన్‌ను వేగంగా, నిర్ణయాత్మకంగా ముగించే చర్యగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల మోహరింపు మరింత పెరుగుతోంది. దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు, 19 యుద్ధ నౌకలు, అదనపు వైమానిక రక్షణ, యుద్ధ సామగ్రి ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇక పెద్ద ఎత్తున యుద్ధం ముదిరితే నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ సీనియర్ సహాయకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. గత నెలలో ట్రంప్‌కు అదనపు సైనిక ప్రణాళికలపై వివరణ ఇచ్చారు. ఇందులో ఇరాన్‌పై మరింత తీవ్రంగా వైమానిక దాడులు నిర్వహించడం, హార్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దీవులను స్వాధీనం చేసుకునేందుకు భూతల ఆపరేషన్ చేపట్టడం, అణు కార్యకలాపాలకు రహస్యంగా ఉపయోగిస్తున్నట్లు అమెరికా అధికారులు భావిస్తున్న బలమైన భద్రతా కేంద్రం ‘పిక్యాక్స్ మౌంటెన్’పై దాడి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. అలాంటి చర్యలు చేపట్టాలంటే మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ స్థాయిలో సైనిక బలగాలను కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరు దేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధిపై అమెరికా ప్రస్తుతం “దాదాపు పూర్తి నియంత్రణ” సాధించిందని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా నౌకాయానంపై, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ ప్రజలు చివరకు తిరుగుబాటు చేసి పోరాడతారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.

యుద్ధం కారణంగా అమెరికా సైన్యానికి సరఫరాలు, రవాణాకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సాధారణ రీసప్లై మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో.. అమెరికా నేవీకి హిందూ మహాసముద్రంలోని దూర ప్రాంతంలో ఉన్న డీగో గార్సియా అమెరికా-బ్రిటన్ సైనిక స్థావరంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అదే సమయంలో అమెరికా ఆర్మీకి చెందిన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్లోని కొన్ని బలగాలు 2027 వరకు మధ్యప్రాచ్యంలోనే మోహరించి ఉండే అవకాశం ఉందని సమాచారం. సైనిక అధికారులు తమ కుటుంబాలకు పంపిన లేఖను WSJ పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.

ట్రంప్ అసలు వ్యూహం ఏంటి?

ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నప్పటికీ.. మరోవైపు పెంటగాన్ మాత్రం వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్న సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమవుతోంది. దీంతో ఇరాన్ విషయంలో ట్రంప్ తుది వ్యూహంపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది. యుద్ధానికి ముగింపు పలికి ఆర్థిక ఒత్తిడితో ఇరాన్‌ను బలహీనపరచాలనుకుంటున్నారా? లేక అవసరమైతే మరింత పెద్ద సైనిక చర్యకు దిగుతారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.