Reading Time: 2 minutes
C Kalyan Slams Producers Guild Telugu Film Producers Council Elections

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల వేళ టాలీవుడ్ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీరుపై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ కాజేస్తోందని, సంస్థకు తీవ్ర వెన్నుపోటు పొడుస్తోందని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం చదలవాడ శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన ‘మన ప్యానెల్’ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. తాజాగా నిర్మాత అశోక్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత పరిణామాలు వేగంగా మారడంతో సి.కళ్యాణ్ ప్యానెల్ రంగంలోకి దిగింది. గిల్డ్ వ్యవహారశైలిపై నిప్పులు చెరుగుతూ మాట్లాడిన కళ్యాణ్.. “గిల్డ్‌కు మేము ఆది నుంచి పూర్తి సహకారం అందించాం. కానీ వారు కౌన్సిల్‌కే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే వారు బయటకు వస్తారు. కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును గిల్డ్ లాగేసుకుంటోంది. కొత్తగా వచ్చే నిర్మాతలకు కనీసం సభ్యత్వం కూడా ఇవ్వడం లేదు” అంటూ ఘాటు ఆరోపణలు చేశారు.

తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్యానెల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన సి.కళ్యాణ్, బండ్ల గణేష్‌తో పాటు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణతోనూ ఇప్పటికే సానుకూలంగా చర్చించామని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు అడుగుజాడల్లోనే నడుస్తామని పునరుద్ఘాటించారు. గతంలో మెడిక్లైమ్ తీసుకొచ్చింది తామేనని గుర్తు చేస్తూ, ఎన్నికైన వెంటనే దానిని రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతామన్నారు. ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో అందించిన తరహాలోనే పేద నిర్మాత కుటుంబాల పిల్లల చదువుకు రూ. 30 వేలు, ఆడబిడ్డ పెళ్లి కోసం రూ. 30 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందజేస్తామన్నారు.

వృద్ధులకు పెన్షన్ కమిటీని వేసి నెలానెలా ఆర్థిక సాయం అందించడంతో పాటు, మరణించిన నిర్మాతల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. చిన్న సినిమాలకు పెద్ద పీట వేస్తూ వెబ్‌సైట్ ద్వారా ఓటీటీ బిజినెస్ సులువుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీ ఎఫ్‌డీసీ (APFDC) భారత్ భూషణ్ గతంలో పనిచేసిన అందరికంటే అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఆస్తుల రక్షణ, పరిశ్రమ సమస్యలపై త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను స్వయంగా కలిసి చర్చిస్తామని పేర్కొన్నారు. గతంలో నిర్మించిన భవనాల అద్దెల ద్వారా వచ్చే ఆదాయంలో 30 శాతాన్ని 2032 నుండి పూర్తిగా సినీ వర్గాల సంక్షేమానికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. కౌన్సిల్ ఉనికిని కాపాడుతూ చిన్న నిర్మాతలకు గట్టి భరోసా ఇవ్వడమే తమ లక్ష్యమని సి.కళ్యాణ్ ప్యానెల్ తేల్చిచెప్పింది. గిల్డ్ లక్ష్యంగా కళ్యాణ్ సంధించిన తాజా అస్త్రాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.