Reading Time: 2 minutes
Nayanthara Sudden Change Movie Promotions Hi Movie Toxic

Nayanthara: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం సినిమాల ప్రమోషన్స్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార.. ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాల కోసం ప్రేక్షకుల్లోకి వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆమె ప్రమోషన్ స్ట్రాటజీపై చర్చిస్తున్నారు. కొన్నేళ్లుగా నయనతార సినిమాల ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా సైన్ చేసే సమయంలోనే ప్రమోషనల్ ఈవెంట్స్‌కు హాజరుకాలేనని ఆమె ముందుగానే స్పష్టం చేస్తారనే టాక్ ఉంది. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినా ప్రమోషన్స్‌కు వచ్చే విషయంలో ఆమె నిర్ణయం మారదనే ప్రచారం కూడా గతంలో జరిగింది. అయితే ఇటీవల మాత్రం నయనతార వ్యవహారశైలిలో మార్పు కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యష్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్‌కు నయనతార హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. యష్ స్వయంగా ఫోన్ చేయడంతో తాను ఈ కార్యక్రమానికి వచ్చానని అప్పట్లో నయనతార వెల్లడించిన విషయం కూడా వైరల్ అయింది.

ఇక తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ‘హాయ్’ సినిమా విషయంలో నయనతార ప్రమోషన్స్‌లో మరింత యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తమిళం, తెలుగు అనే తేడా లేకుండా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తొలిసారి థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను నేరుగా కలవడం, అభిమానులతో సెల్ఫీలు దిగడం, మైక్ పట్టుకుని మాట్లాడటం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న నయనతార ఇలా ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు కూడా కొత్తగా అనిపిస్తోంది. దీంతో కొందరు నెటిజన్లు నయనతారపై ట్రోలింగ్ చేస్తున్నారు. సొంత సినిమాకు ప్రమోషన్స్ విలువ తెలిసి.. ఇతర హీరోల సినిమాలకు మాత్రం అదే స్థాయిలో ప్రమోషన్స్ చేయడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ఒక నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం సహజమేనని, అన్ని సినిమాలకు ఒకే విధంగా ప్రమోషన్స్ చేయాలనే నిబంధన లేదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ‘హాయ్’ విషయానికి వస్తే.. నయనతార, కవిన్ జంటగా నటించిన ఈ చిత్రానికి విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించారు. సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్న నేపథ్యంలో.. నయనతార స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న నయనతారకు సినిమా ప్రమోషన్స్‌పై కొత్త అవగాహన వచ్చిందా? లేక సొంత ప్రాజెక్ట్ కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.