
- లక్ష మందికిపైగా హాజరయ్యేలా కార్యాచరణ
- ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ న్యాయమైన డిమాండ్లేనని, వాటిని పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల10న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’లో భాగంగా ‘హక్కుల సాధన సభ’ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సభ పోస్టర్ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మూడేండ్లవుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నివేదిక తీసుకోలేదన్నారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఈహెచ్ఎస్ జీవో అమలు కావడం లేదని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రులు సైతం ఈహెచ్ఎస్ను అంగీకరించడం లేదన్నారు.