
బషీర్బాగ్, వెలుగు: అసెంబ్లీకి రాని మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవని సతీశ్ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సంబంధించిన ప్రభుత్వ ఖర్చు రూ.22.24 కోట్లకు చేరిందని, ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వహించని ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు.
సైనిక్పురి నుంచి బైక్ ర్యాలీ
మల్కాజిగిరి: అసెంబ్లీకి దూరంగా ఉంటున్న కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. సైనిక్పురి నుంచి ఈసీఐఎల్ వరకు ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్ కాప్రా డివిజన్ అధ్యక్షుడు తన్నీరు శ్రీహరి, ఏఎస్రావునగర్డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు దండ్ల మురళి, పాకాల రాజు తదితరులు పాల్గొన్నారు.