Reading Time: 2 minutes
Bonaboyina Srinivas Yadav Guntur Jana Sena Controversies

ఆయన గతంలో టీడీపీ నేత. తర్వాత జనసేనలో చేరారు. అక్కడ మంచి ప్రాధాన్యతే లభించింది. అయితే ఓ చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఓ కార్యక్రమంలో గన్ మెన్‌తో జరిగిన గొడవ కలకలం రేపింది. తాజాగా తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేయడం సంచలనానికి కారణమైంది. అయితే అదంతా పబ్లిసిటీ కోసమేనన్న ప్రచారం ఇప్పుడా నేతకు ఇబ్బందిగా మారిందట. ఇంతకీ ఎవరా నేత..? ఏమాయన కథ..? చూద్దాం.

బోనబోయిన శ్రీనివాసయాదవ్. గుంటూరులో బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. గతంలో టీడీపీలో పనిచేశారు. టీడీపీలో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జనసేనలో చేరారు. జనసేన తరపున 2019లో గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్షా 29వేల ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ పేరుకు జనసేన నాయకుడే అయినా ఆయనకు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలున్నాయని గుంటూరులో టాక్.

2019లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ఎంపీలతోపాటు 15 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది. వైసీపీ హయాంలో ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. చాలామంది వైసీపీ నాయకులు ఛైర్మన్ పదవి ఆశించారు. కానీ అనుహ్యంగా జనసేనకు చెందిన బోనబోయిన శ్రీనివాసయాదవ్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైసీపీ హయాంలోనే రెండోసారి కూడా చైర్మన్‌గా ఎన్నికయ్యాడంటే బోనబోయిన లాబీయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా బోనబోయినకు అవకాశం దక్కలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోనబోయిన వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

రెండేళ్ల క్రితం దీపావళి సందర్బంగా వైసీపీ నేత నరేంద్రరెడ్డి ఇంటిపై బోనబోయిన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు నరేంద్రరెడ్డి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. పోలీసులపై బోనబోయిన ఒత్తిడి వల్లే కేసు నమోదు కాలేదన్న ఆరోపణలున్నాయి. నరేంద్రరెడ్డి నిర్వహిస్తున్న బార్ ఇళ్ల మధ్యలో ఉందంటూ మహిళలు ఆందోళనకు దిగడం, బార్ నిర్మాణానికి అనుమతులు లేవంటూ కార్పోరేషన్ అధికారులు కూల్చివేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల వెనుక బోనబోయిన ఉన్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆరు నెలల క్రితం యాదవ సామాజికవర్గం కార్తీక వనభోజనాలకు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ కూడా హాజరయ్యారు.

ఆ సందర్భంగా… యాదవులకు కూడా ఒక పార్టీ కావాలని, మన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కూడా సీఎం కావాలంటూ బోనబోయిన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. నెల రోజుల క్రితం గుంటూరు అర్బన్ బ్యాంక్ ఛైర్మన్‌గా బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్ కొడుకు కౌశిక్ ఎన్నికయ్యాడు. ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్ మెన్‌తో బోనబోయిన అనుచరులు గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు. బోనబోయినతో రఘురామకృష్ణంరాజు గన్ మెన్ దురుసుగా ప్రవర్తించారని అనుచరులు దాడికి దిగారు.

దాడి సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. తాజాగా వైసీపీ నేత నరేంద్రరెడ్డి తనను హత్య చేసేందుకు కోటిన్నరకు సుపారీ మాట్లాడారని బోనబోయిన నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోనబోయిన హత్యకు కుట్ర జరిగిందన్న ప్రచారం కలకం రేపింది. దీనిపై వైసీపీ నేత నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను బోనబోయినను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పనిలోపనిగా రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో బోనబోయిన టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. నరేంద్రరెడ్డి చేసిన ఆరోపణలు జనసేనలో కలకలానికి కారణమయ్యాయట.

ఈ కేసులో A-2గా ఉన్న వెంకటేష్ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బోనబోయినతోపాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున కోర్టుకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న కొంతమంది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారట. దీంతో న్యాయమూర్తి పోలీసులకు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రావడంతో బోనబోయిన అనుచరులు అక్కడనుంచి వెళ్లిపోయారు. ఇలా వరుసగా వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ మారడంపై జనసేనలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట.