Reading Time: < 1 minute
Mallu Ravi Comments On Konda Surekha Dismissal Congress Discipline

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఎన్‌టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పార్టీలో ఎంతటి పెద్ద పదవిలో ఉన్నవారైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని, లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.

కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడమే కారణం

కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమని మల్లు రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా బహిరంగంగా దూషిస్తే లేదా విమర్శిస్తే, దానిని వెంటనే ఖండించాల్సిన ప్రాథమిక బాధ్యత క్యాబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖపై ఉందన్నారు. కానీ, తన కూతురు తప్పు చేసిందని ఆఖరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద కూడా ఆమె ఒప్పుకోకపోవడం, కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం సరికాదన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయభేదాలు ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డున పడేయకూడదని హితవు పలికారు.

సమగ్ర విచారణ తర్వాతే నివేదిక

కొండా సురేఖపై గతంలో కూడా పలు ఫిర్యాదులు క్రమశిక్షణ సంఘానికి అందాయని మల్లు రవి వెల్లడించారు. చట్టప్రకారం ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే తాను క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా సమగ్ర నివేదికను తయారు చేసి అధిష్టానానికి ఇచ్చానని తెలిపారు. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి విషయంలోనూ పూర్తి వివరాలు సేకరించి, వారి వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని గుర్తించిన తర్వాతే రిపోర్ట్ సమర్పించామన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి కులాల ప్రాతిపదికన చర్యలు ఉండవని, కేవలం పార్టీ క్రమశిక్షణ మేరకే జరిగాయని స్పష్టం చేశారు.

ఎంత పెద్దవారైనా లక్ష్మణ రేఖ దాటొద్దు

ఈ రాజకీయంపై రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఏఐసీసీ (AICC) నుంచి తుది నిర్ణయం వెలువడిందని తెలిపారు. నిర్ణయం తీసుకోవడం కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రక్రియను నిర్వహించామని చెప్పారు. హోదా లేదా పదవి ఎంత పెద్దదైనా కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఎవరూ అతిక్రమించకూడదని, పార్టీ నిర్దేశించిన లక్ష్మణ రేఖను దాటవద్దని ఈ నిర్ణయం ద్వారా నిరూపితమైందని మల్లు రవి తేల్చి చెప్పారు.