Reading Time: 2 minutes
Trump 50 Military Officials Polygraph Tests Iran War Leaks

Trump: ఇరాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని మీడియాకు ఎవరు చేరవేశారనే అంశంపై అమెరికా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెంటగాన్ జాయింట్ స్టాఫ్‌కు చెందిన సుమారు 50 మంది సైనిక అధికారులు, ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా కొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ దర్యాప్తు ప్రధానంగా ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా ఆయుధ నిల్వలకు సంబంధించిన సున్నితమైన సమాచారం మీడియాకు ఎలా చేరిందనే అంశం చుట్టూ సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలక ఆయుధాల కొరతకు సంబంధించిన వివరాలు జర్నలిస్టులకు లీక్ అయ్యాయా? ఒకవేళ లీక్ అయితే ఆ సమాచారాన్ని ఎవరు అందించారు? అనే కోణంలో అధికారుల విచారణ జరుపుతున్నట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి.

అసలు పాలిగ్రాఫ్ పరీక్ష అంటే ఏమిటో తెలుసా..

సాధారణంగా ‘లై డిటెక్టర్ టెస్ట్’గా పిలిచే పాలిగ్రాఫ్ పరీక్షలో.. ఒక వ్యక్తి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో అతని శ్వాస, హృదయ స్పందన, బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) వంటి శారీరక ప్రతిస్పందనల్లో వచ్చే మార్పులను నమోదు చేస్తారు. ఈ మార్పులను విశ్లేషించడం ద్వారా ఆ వ్యక్తి సమాధానాలు చెబుతున్నప్పుడు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశోధకులు అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. అయితే పాలిగ్రాఫ్‌లో ఒత్తిడి లేదా శారీరక మార్పులు కనిపించడమే ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని చెప్పడానికి ఆధారం కాదు. అందువల్ల ఇటువంటి పరీక్షలను సాధారణంగా దర్యాప్తులోని ఇతర ఆధారాలతో కలిపి పరిశీలిస్తారు. ఇది ఒక్కటే తుది సాక్ష్యంగా చెల్లుబాట కాదు.

50 మందిని ఎందుకు విచారిస్తున్నారంటే..
‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. జాయింట్ స్టాఫ్‌కు సంబంధించిన సుమారు 50 మంది వ్యక్తులను గత నెలలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీరిలో సైనిక అధికారులు, కొంతమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా వద్ద తగ్గుతున్న ఆయుధ నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని జర్నలిస్టులకు ఎవరు అందించారనే దానిపై విచారణ సాగుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇది సాధారణ సమాచారం లీక్‌గా కాకుండా.. యుద్ధ సమయంలో అమెరికా సైనిక సామర్థ్యం, ఆయుధ నిల్వలకు సంబంధించిన సున్నితమైన వివరాలు బయటకు వచ్చిన వ్యవహారంగా అధికారులు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జాయింట్ స్టాఫ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ దర్యాప్తుపై పెంటగాన్ మాత్రం నిర్దిష్ట వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. కొనసాగుతున్న దర్యాప్తులకు సంబంధించిన అంశాలపై సాధారణంగా వ్యాఖ్యానించబోమని పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ పేర్కొన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో జాతీయ భద్రతా సమాచారం అనధికారికంగా లీక్ అయిన ఘటనను అమెరికా రక్షణ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా దర్యాప్తు అధికారులు తెలుసుకోవాలనుకుంటున్న ప్రధాన విషయం ఒక్కటే.. ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా ఆయుధాల పరిస్థితికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం మీడియాకు అసలు ఎలా చేరింది? ఈ లీక్ వెనుక ఎవరున్నారు అనేది తేల్చేందుకు ఈ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.