
Ram Mandir CEO: అయోధ్య రామ జన్మభూమి టెంపుల్ ట్రస్ట్ కొత్త CEOగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకంపై రాజకీయ వివాదం మొదలైంది. ఆయన నియామకంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మిశ్రాను సీఈఓగా నియమించడంపై ప్రశ్నించారు. ‘‘ఆపరేషన్ సిందూర్కు సంబంధించి రహస్యం కారణమై ఉండొచ్చా.?’’ అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నియామక విధానాన్ని కూడా రషీద్ అల్వీ ప్రశ్నించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా నియమిస్తున్నారని, ఇప్పుడు రిటైర్డ్ ఎయిర్ చీఫ్ను రామ మందిర ట్రస్ట్ సీఈఓగా నియమించారని అన్నారు. రిటైర్ ఎయిర్ చీఫ్కు రామ మందిరంతో సంబంధం ఏమిటి.? ఆపరేషన్ సిందూర్లో ఏదో నిగూఢమైన రహస్యం ఉందని, దాని కారణంగానే జితేంద్ర మిశ్రా నియామకం జరిగిందని తాను అనుమానిస్తున్నట్లు రషీద్ అల్వీ అన్నారు.
రామ మందిరానికి సంబంధించి గతంలో జరిగినట్లు ఆరోపించిన అక్రమాలపై ఇప్పటి వరకు పూర్తి వివరాలు వెల్లడించలేదని, బాధ్యులందరిని అరెస్ట్ చేయలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి నష్టం చేస్తున్నాయని అల్వీ విమర్శించారు.
రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై బీజేసపీ ఘాటుగా స్పందించింది. జేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి కాంగ్రెస్పై ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ పార్టీకి సనాతన ధర్మాన్ని, భారత సైన్యాన్ని అవమానించడమే అలవాటుగా మారిందని ఆరోపించారు. బాబ్రీ మసీదు అంశం నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు కాంగ్రెస్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ ప్రస్తావించింది. కాంగ్రెస్ బాబ్రీకి మద్దతుదారు అని, ఆర్మీ చీఫ్ను గుండా అని అవమానించిందని, సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలు అడిగిందని, ఇప్పుడు రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా మాజీ ఎయిర్ మార్షల్ నియామకాన్ని ప్రశ్నిస్తున్నారని రాకేష్ త్రిపాఠి విమర్శించారు.