Reading Time: < 1 minute

ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ మద్దతు ధర  25 వేలు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Caption of Image.
  • తెలంగాణలో ప్రాంతీయ ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణ పరిమితి పెంచాలని డిమాండ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ గెలలకు క్వింటాల్‌‌‌‌కు కనీస మద్దతు ధర రూ.25 వేలు నిర్ణయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌‌‌‌సింగ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌‌‌ను ఆయన కలిశారు. ఐసీఏఆర్‌‌‌‌-ఐఐఓపీఆర్‌‌‌‌కు అనుబంధంగా తెలంగాణలో ప్రాంతీయ ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర వాతావరణానికి అనుగుణంగా పరిశోధనలు చేపట్టి.. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కందులు, పెసలు, మినుములు, శనగతో పాటు నూనెగింజల సేకరణ పరిమితిని ప్రస్తుత 25 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని తుమ్మల కోరారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సేకరిస్తున్న జొన్న, మొక్కజొన్నలను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎంఆర్‌‌‌‌కేవీవై-పర్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ మోర్‌‌‌‌ క్రాప్‌‌‌‌ పథకం కింద తెలంగాణకు అదనపు నిధులు కేటాయించాలని తుమ్మల కోరారు. రాష్ట్రానికి అదనంగా ప్రధానమంత్రి ఆవాస్‌‌‌‌ యోజన ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌‌‌ను కోరారు.

©️ VIL Media Pvt Ltd.