
Rohit Sharma Retirement Twist: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్పై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్కు భారత జట్టు సన్నాహకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రోహిత్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈరోజు జరిగే బీసీసీఐ బోర్డు సమావేశంలో ఈ ముగ్గురిపై సమీక్ష ఉండొచ్చని ఓ జాతీయ మీడియా తన నివేదికలో పేర్కొంది.
ముందుగా అంగీకరించిన రోహిత్:
రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీలో ఇంతకుముందే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీలోని ఓ సభ్యుడు (బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కాకుండా) రోహిత్తో మాట్లాడాడట. 2027 వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో సెలెక్టర్లు భవిష్యత్తులో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారనే విషయాన్ని హిట్మ్యాన్కు తెలియజేశారట. దీనిపై రోహిత్ ముందుగా అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం రిటైర్ కావడానికి అంగీకరించాడట. అయితే లార్డ్స్లో జరిగిన మూడో వన్డేలో రోహిత్ 138 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో.. అప్పటికప్పుడు రిటైర్మెంట్ ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో రోహిత్ భవిష్యత్తుపై ఈరోజు జరిగే బీసీసీఐ భేటీలో మరోసారి చర్చ మొదలయ్యే అవకాశముంది.
సీనియర్లు జట్టులో ఉండాల్సిందే:
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్లో ఆడాలనే తన అభిప్రాయాన్ని రోహిత్ శర్మ ఇప్పటికే బీసీసీఐకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్ కూడా రోహిత్ ప్రాధాన్యాన్ని వివరించాడు. ప్రపంచ కప్ వంటి అత్యంత ఒత్తిడితో కూడిన టోర్నీల్లో అనుభవం కూడా ఎంపికలో కీలకమైన అంశమని చెప్పాడు. కేవలం ప్రతిభ, గణాంకాలు మాత్రమే కాకుండా.. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన సీనియర్లు జట్టుకు ఎంతో ఉపయోగపడతారని జాంటీ అభిప్రాయపడ్డాడు. నాలుగు ప్రపంచ కప్లలో ఆడిన అనుభవం, పెద్ద టోర్నీలలో ఒత్తిడిని ఎదుర్కొన్న పరిజ్ఞానం ఉన్నందున.. 2027 వన్డే ప్రపంచ కప్లో హిట్మ్యాన్ టీమిండియాకు విలువైన ఆస్తిగా మారగలడని రోడ్స్ పేర్కొన్నాడు.
హాట్ టాపిక్గా రోహిత్ భవిష్యత్తు:
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా భవిష్యత్తుపైనా బీసీసీఐ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఈ సీనియర్ ఆటగాళ్ల పాత్ర, జట్టు భవిష్యత్ కూర్పు వంటి అంశాలను అధికారులు పరిశీలించనున్నట్లు సమాచారం. లార్డ్స్ వన్డేలో రోహిత్ 138 పరుగుల ఇన్నింగ్స్ నేపథ్యంలో.. అతడి కెరీర్పై తుది నిర్ణయం తీసుకోకపోవచ్చనే చర్చ కూడా ఉంది. మొత్తంగా 2027 వన్డే ప్రపంచ కప్ దిశగా టీమిండియా అడుగులు వేస్తున్న సమయంలో.. రోహిత్ భవిష్యత్తు మరోసారి హాట్ టాపిక్గా మారింది. బీసీసీఐ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?.. రోహిత్ వన్డే జట్టులో కొనసాగుతాడా?.. రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.