
అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూకి రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వాటిని తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు డోనర్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఎవరూ దొరకలేదు.
ఈ నేపథ్యంలో వైద్యులు అతనికి జన్యుపరంగా మార్పు చేసిన (జెనటికల్లీ ఎడిటెడ్) పంది కిడ్నీని అమర్చారు. ఈ సర్జరీ 2025 జనవరిలో జరిగింది. ఆండ్రూ పంది కిడ్నీ సహాయంతో, డయాలసిస్ అవసరం లేకుండా 9 నెలలు గడిపాడు. ఆ తర్వాత ఆ పంది కిడ్నీలో సమస్య తలెత్తింది. దీంతో వైద్యులు మరోసారి ఆపరేషన్ చేసి ఆ పంది కిడ్నీని తొలగించారు. కొన్ని రోజుల పాటు ఆండ్రూ డయాలసిస్ మీద జీవించాడు. ఆ తర్వాత 2026లో ఆర్గాన్ డోనర్ కిడ్నీని అతనికి అమర్చారు.
ఆండ్రూ 271 రోజుల పాటు పంది కిడ్నీ సహాయంతో డయాలసిస్ అవసరం లేకుండా జీవించడం ఒక వైద్య అద్భుతం (మెడికల్ మిరాకిల్) అని మాస్ బ్రిగ్ హామ్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. వైద్య చరిత్రలో ఇదే మొదటి కేసని వారు అన్నారు. ఆ పంది కిడ్నీ పాడవడానికి గల కారణాలను కూడా వారు వెల్లడించారు. 271 రోజుల పాటు పనిచేయడం వల్ల ఆ పంది కిడ్నీలోని సూక్ష్మ రక్తనాళాలలో గాయాలు (మైక్రోవ్యాక్యులర్ ఇంజ్యూరీస్), వాపు (ఇన్ఫ్లమేషన్) ఏర్పడ్డాయని వారు తెలిపారు. ఆండ్రూకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆరు నెలల తర్వాత పంది కిడ్నీలో రోగనిరోధక శక్తిని అణచివేసే వ్యవస్థ (ఇమ్యూనోసప్రెషన్) దెబ్బతిందని వారు తెలిపారు. ఆ కారణంగానే ఆ పంది కిడ్నీ పాడైపోయిందని తెలిపారు.
జంతువుల అవయవాల మార్పిడి ఎందుకు?
మనుషులలో కిడ్నీలు, గుండె వంటి అవయవాల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా పెంచిన పందుల నుంచి అవయవాలను సేకరిస్తారు. సర్జరీ ద్వారా ఆ అవయవాన్ని రోగికి అమరుస్తారు. మనిషి శరీరం ఆ అవయవాన్ని పరాయి వస్తువుగా గుర్తించి తీవ్రంగా తిరస్కరిస్తుంది. దీనిని నివారించడానికి ఆధునిక సాంకేతికత ద్వారా ఆ జంతువుల జన్యువులలో మార్పులు (జెనెటికల్లీ ఎడిటెడ్) చేస్తారు. మనుషులకు హాని చేసే లేదా ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్లను తొలగిస్తారు.
అయితే రోగి శరీరం ఆ కొత్త అవయవాన్ని స్వీకరించేలా చేయడానికి, రోగనిరోధక శక్తిని నియంత్రించే ప్రత్యేక మందులను డాక్టర్లు ఇస్తారు. ప్రస్తుతం మానవ శరీర అవయవాల కొరతను తీర్చడానికి, ప్రాణాలను కాపాడడానికి ఈ జెనెటికల్లీ ఎడిటెడ్ పంది కిడ్నీలు, గుండెలను అమర్చే ప్రయోగాలు వైద్య రంగంలో విస్తృతంగా జరుగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చూడండి!