Reading Time: 3 minutes
Us Bond Yields Near 5 Percent Threat Indian Stock Market

Stock Market: దేశ ఆర్థిక వ్యవస్థకు షేర్ మార్కెట్‌ కీలకంగా మారిపోయింది. కోట్లాది మంది భారతీయులు నేరుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గత రెండేళ్లుగా మార్కెట్‌ ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త రికార్డు గరిష్ఠాలను అందుకోవడంలోనూ మార్కెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి మరో కొత్త ముప్పు తెరపైకి వచ్చిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈసారి సమస్య టారిఫ్‌లు, ఆంక్షలు కాదు. అమెరికాతో పాటు పలు ప్రధాన దేశాల ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ భారీగా పెరగడం మార్కెట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ యీల్డ్ దాదాపు 4.81 శాతానికి చేరడం, ఇది 5 శాతం వైపు కదిలే అవకాశం ఉండటంతో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది.

దశాబ్దాల గరిష్ఠాలకు బాండ్ యీల్డ్స్

ప్రపంచ బాండ్ మార్కెట్‌లో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ యీల్డ్ దాదాపు మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. యీల్డ్ 5 శాతాన్ని తాకితే ఇప్పటికే అస్థిరంగా ఉన్న షేర్ మార్కెట్లలో మరింత ఒడిదుడుకులకు లోనైయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా మాత్రమే కాదు.. జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ గణనీయంగా పెరిగాయి. జపాన్ 10 ఏళ్ల బాండ్ యీల్డ్ 3 శాతం దాటింది. ఇది దాదాపు మూడు దశాబ్దాల్లో అత్యధిక స్థాయి. ఆస్ట్రేలియా 10 ఏళ్ల బాండ్ యీల్డ్ కూడా 5.198 శాతానికి చేరింది. భారత మార్కెట్‌పైనా దీని ప్రభావం కనిపిస్తోంది. దేశీయ 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ యీల్డ్ మూడు నెలల తర్వాత తొలిసారిగా కొద్దిసేపు 7 శాతాన్ని దాటింది. అంతర్జాతీయంగా బాండ్లలో అమ్మకాలు పెరగడం, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.

అసలు బాండ్ యీల్డ్స్ ఎందుకు పెరుగుతున్నాయి
బాండ్ యీల్డ్స్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు భారీగా అప్పులు తీసుకోవడం వాటిలో ముఖ్యమైనది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ రుణభారం భారీ స్థాయికి చేరుకోవడం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో భారీ పెట్టుబడులు కూడా బాండ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. డేటా సెంటర్లు, AI మోడళ్ల కోసం టెక్ దిగ్గజాలు భారీగా అప్పులు సమీకరిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో కార్పొరేట్ బాండ్ల సరఫరా పెరుగుతోంది. ఆల్ఫాబెట్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు డేటా సెంటర్లు, AI మౌలిక వసతుల కోసం భారీగా అప్పులు సమీకరిస్తున్నాయి. అప్పులకు డిమాండ్ పెరిగితే.. పెట్టుబడిదారులు కూడా అధిక వడ్డీని కోరుతారు. దీంతో బాండ్ యీల్డ్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో గ్లోబల్ కార్పొరేట్ బాండ్ మార్కెట్‌లోనూ రుణాల జారీ భారీగా పెరుగుతోంది.

మరో సమస్యగా చమురు ధరలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో సవాలుగా మారాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరగడంతో లాభాల మార్జిన్లపై ప్రభావం పడవచ్చు. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలోనూ వెనుకడుగు వేయవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చే సంకేతాలు కూడా మార్కెట్లకు కీలకంగా మారాయి. ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటే వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించాల్సి రావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే అమెరికా బాండ్లపై రాబడి మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకుని అమెరికా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

భారత షేర్ మార్కెట్‌కు ముప్పు ఎలా..

FIIల నిధుల ఉపసంహరణ: అమెరికా ట్రెజరీ బాండ్లలో తక్కువ రిస్క్‌తో ఆకర్షణీయమైన రాబడి లభిస్తే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను తరలించే అవకాశం ఉంటుంది.

స్టాక్ వాల్యుయేషన్లపై ఒత్తిడి: బాండ్ యీల్డ్స్ పెరిగితే ఈక్విటీ పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. ముఖ్యంగా అధిక P/Eతో ట్రేడవుతున్న షేర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

కంపెనీలకు అప్పుల భారం: దేశీయ బాండ్ యీల్డ్స్ పెరగడంతో కంపెనీలు కొత్తగా రుణాలు తీసుకోవడం ఖరీదుగా మారుతుంది. ఇది కంపెనీల వడ్డీ వ్యయాలను పెంచి లాభాలపై ప్రభావం చూపవచ్చు.

చమురు ధరల ప్రభావం: క్రూడ్ ధరలు పెరిగితే భారత్ దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి రావడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది.

రూపాయి విలువపై ఒత్తిడి: అమెరికా ఆస్తుల్లో పెట్టుబడులు పెరిగితే డాలర్‌కు డిమాండ్ పెరగవచ్చు. దీంతో రూపాయి బలహీనపడే అవకాశం ఉంటుంది. రూపాయి పడిపోతే చమురు వంటి దిగుమతుల వ్యయం మరింత పెరుగుతుంది.

ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో అధిక రిస్క్ తీసుకోవడం కంటే నాణ్యమైన కంపెనీలపై దృష్టి పెట్టడం కీలకం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారీ అప్పులు ఉన్న, అధిక వాల్యుయేషన్లతో ఉన్న స్టాక్స్‌లో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బలమైన బ్యాలెన్స్‌షీట్, తక్కువ లేదా అప్పులు లేని, స్థిరమైన క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీలు ఇలాంటి అస్థిర మార్కెట్ పరిస్థితుల్లో కొంత మెరుగైన రక్షణ ఇవ్వగలవని చెబుతున్నారు. అయితే బాండ్ యీల్డ్స్ పెరగడం ఒక్కటే షేర్ మార్కెట్ పతనానికి కారణమని చెప్పలేమని పేర్కొంటున్నారు. వడ్డీ రేట్లు, చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, కంపెనీల లాభాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అనేక అంశాలపై మార్కెట్ తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.