
Trump’s Pickaxe Mountain Warning: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని అత్యంత కీలకమైన భూగర్భ అణు కేంద్రాల్లో ఒకటిగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ (Pickaxe Mountain)పై త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పికాక్స్ మౌంటెన్లో అణు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే దానిని తప్పకుండా లక్ష్యంగా చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.
‘అణ్వాయుధం తయారు చేసుకోనివ్వం’
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని, అలా జరిగితే పరిస్థితులు తీవ్రంగా మారతాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కదలికలను అమెరికా నిశితంగా గమనిస్తోందని ట్రంప్ చెప్పారు. పికాక్స్ మౌంటెన్లో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం కనిపిస్తే అక్కడ దాడి చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అవసరమైతే అమెరికా “గట్టిగా దాడి చేస్తుంది” అనే సంకేతాన్ని ఇచ్చారు.
పికాక్స్ మౌంటెన్ ఎక్కడ ఉంది?
పికాక్స్ మౌంటెన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో, నాటాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉంది. నాటాంజ్ అణు కేంద్రాన్ని అధికారికంగా షాహిద్ అహ్మదీ రోషన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని పిలుస్తారు. ఇది ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత కీలకమైన కేంద్రంగా పరిగణించబడుతోంది.
నాటాంజ్పై దాడుల తర్వాత పికాక్స్ మౌంటెన్పై దృష్టి
2025 జూన్లో జరిగిన 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నాటాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో నాటాంజ్ కేంద్రానికి భారీ నష్టం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత అమెరికా కూడా B-2 Spirit బాంబర్లను ఉపయోగించి నాటాంజ్ సహా ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేసింది. భారీ బంకర్-బస్టర్ బాంబులను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వెల్లడైంది. అనంతరం ఇజ్రాయెల్ ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా మరిన్ని విధ్వంసక చర్యలు చేపట్టింది. ఈ వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ తన అణు కార్యక్రమంలోని కీలక కార్యకలాపాలను మరింత సురక్షితమైన భూగర్భ ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
80 నుంచి 100 మీటర్ల లోతులో నిర్మాణం
పికాక్స్ మౌంటెన్లో నిర్మిస్తున్న కొత్త భూగర్భ సదుపాయం సుమారు 2.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. ఈ కేంద్రాన్ని భూమికి సుమారు 80 నుంచి 100 మీటర్ల లోతులో నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంత లోతులో నిర్మాణం చేపట్టడం వల్ల సాధారణ వైమానిక దాడుల నుంచి ఈ కేంద్రానికి రక్షణ లభించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలు, భారీ భద్రతా కంచెలు, ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) భద్రత ఉన్నట్లు సమాచారం.
అణు కార్యక్రమానికి కీలక కేంద్రంగా మారే అవకాశం
నిపుణుల అంచనాల ప్రకారం పికాక్స్ మౌంటెన్లో నిర్మిస్తున్న భూగర్భ సదుపాయాన్ని యురేనియం శుద్ధీకరణ (enrichment)తో పాటు సెంట్రిఫ్యూజ్ల తయారీకి ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతంపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నాటాంజ్పై గతంలో జరిగిన దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత లోతైన, రక్షిత ప్రాంతానికి తరలిస్తే.. దానిని అడ్డుకోవడం అమెరికా, ఇజ్రాయెల్కు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతకు సంకేతాలా?
పికాక్స్ మౌంటెన్ను త్వరలోనే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చే అవకాశాలపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ చర్యలు.. ఇవన్నీ కలిసి ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అంశాలుగా మారాయి. పికాక్స్ మౌంటెన్పై అమెరికా వాస్తవంగా దాడి చేస్తుందా లేదా అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.