Reading Time: 2 minutes
Bjp Protest Over Telangana Fee Reimbursement Dues Secretariat Siege Attempt

BJP Protest: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సచివాలయం ముట్టడికి యత్నించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి తదితర నేతలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.

సచివాలయం సౌత్‌ ఈస్ట్‌ గేటు వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావుతో పాటు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, గౌతం రావు, బీజేవైఎం అధ్యక్షుడు గణేష్‌ కుండే, బండారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీ డీకే అరుణను అరెస్ట్‌ చేసి గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందజేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమని బీజేపీ నేతలు విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.

కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అనేక మంది యువత చదువులు పూర్తయినా ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఫీజులు చెల్లించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ సందర్బంగా.. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని, అలాంటప్పుడు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదని రామచందర్‌ రావు ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద విద్యార్థుల చదువులు, వారి భవిష్యత్‌ దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గద్దె దిగాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.