Reading Time: < 1 minute
Prahlad Joshi Takes Charge As Union Education Minister After Dharmendra Pradhan Resignation

Prahlad Joshi: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా అనంతరం ఆ మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికు అప్పగించిన విషయం విదితమే. ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ బాధ్యతలను జోషికి అప్పగించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. వినయం, అత్యంత బాధ్యతాయుతమైన ధోరణితో తన విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. గడిచిన 4-5 ఏళ్లలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యా విధానాన్ని (NEP) సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యాశాఖలో అనేక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ప్రస్తుతం ధార్వాడ్ (కర్ణాటక) లోక్‌సభ ఎంపీగా ఉన్న 63 ఏళ్ల ప్రహ్లాద్ జోషి, తన వద్ద ఉన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల బాధ్యతలతో పాటు అదనంగా విద్యాశాఖను నిర్వర్తించనున్నారు.

మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన FIRలను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గడచిన 49 రోజులుగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిర్వహిస్తున్న ఆందోళన ముగిసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో CJP ప్రతినిధి బృందం మూడు విడతలుగా జరిపిన చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అనుకున్న సమయానికి నెరవేరుస్తుందనే నమ్మకంతోనే ఈ నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.