
DUSU Elections 2026: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (DUSU) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) సంచలన విజయం నమోదు చేసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI చతికిలపడింది. మొత్తం నాలుగు పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్ష, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టుల్ని గెలుచుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. భారీ మెజారిటీతో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ అభ్యర్థిని ఓడించారు. విద్యార్థి సంఘ చరిత్రలోనే ఈ పదవిని గెలుచుకున్న తొలి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు.
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యక్ష పదవిని యశ్ దాబాస్ సొంతం చేసుకున్నారు. సెక్రటరీగా రియా చబాడి, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. వీరు ముగ్గురు ఏబీవీపీకి చెందినవారే.
చెప్పులు లేకుండా ప్రచారం..
చెప్పులు లేకుండా ఎన్నికల ప్రచారంలో దిగిన దీపాంశు అందరి దృష్టిని ఆకర్షించారు. విద్యార్థి సమస్యలు, జవాబుదారీతనం, న్యాయం కోసం పోరాడుతానని హామీలు ఇచ్చారు. ఇటీవల, సత్య నికేతన్ ప్రైవేట్ హాస్టల్ కూలిన ఘటనలో పలువురు విద్యార్థులు మరణించారు. దీని తర్వాత, వారికి న్యాయం జరిగే వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేసినట్లు చెప్పారు.
ఎవరు ఈ దీపాంశు షోకీన్..
ఏబీవీపీ హవా, ఎన్ఎస్యూఐ పోటీని తట్టుకుని నిలబడిన దీపాంశు షోకీన్ ఢిల్లీ యూనివర్సిటీలో డిపార్టమెంట్ ఆఫ్ బుద్దిస్ట్ స్టడీస్లో చదువుతున్నారు. ఆయన ఢిల్లీలోని పీరాగఢి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి బస్ కండక్టర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్త. విద్యార్థి రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో దీపాంశు ఉండగా, ఆయన తండ్రి మాత్రం తన కొడుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతున్నారు.
NSUI హ్యాండిచ్చినా, విజయం సాధించారు..
దీపాంశు ముందుగా ఎన్ఎస్యూఐ నుంచి పోటీ చేయాలని భావించారు. టికెట్ కోరారు. అయితే ముందుగా టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, చివరి నిమిషంలో ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి సత్తా చాటారు. తనకు పెద్ద పెద్ద వాహనాలు, పలుకుబడి లేదా ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసే ఆర్థిక సామర్థ్యం లేదనే అంశాలతో తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తున్నారు.