Reading Time: < 1 minute

రెజినగర్ ఉప ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. చివరి నిమిషంలో టీఎంసీ అభ్యర్థి యూ టర్న్

Caption of Image.

కోల్‎కతా: నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాల్లో సినిమా రేంజ్‎లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీ అభ్యర్థులు ఝలక్‎ల మీద ఝలక్‎లు ఇస్తున్నారు. ఇప్పటికే నందిగ్రామ్ ఉప ఎన్నిక నుంచి మమతా వర్గానికి చెందిన సంచితా ప్రధాన్ డే పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగానే.. రెజినగర్ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి కూడా ఉప ఎన్నిక రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. 

పార్టీ పేరు, గుర్తు మార్పు, ప్రభుత్వ యంత్రాగం ఒత్తిడి, కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో రెజినగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనుకుంటున్నానని ఆయన తెలిపారు. అయితే, నామినేషన్ దాఖలకు చివరి రోజు రబియుల్ ఆలం చౌదరి మనసు మార్చుకున్నాడు. రెజినగర్ ఉప ఎన్నికలో మమతా వర్గం టీఎంసీ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాడు. నాటకీయ పరిణామాల అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రెజినగర్ లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ మధ్య త్రిముఖ పోరు జరగనుంది. 

అంతర్గత విభేదాల నేపథ్యంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రెండుగా చీలింది. మమతా బెనర్జీని వ్యతిరేకిస్తూ రితబత్రా బెనర్జీ నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ గుర్తు, పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసింది. ఉప ఎన్నికల కోసం మమతా, రితబత్రా వర్గాలకు వేర్వేరు గుర్తు, పేరు కేటాయించింది. నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల్లో రితబత్రా బెనర్జీ వర్గం కూడా పోటీ చేస్తోంది.

 నందిగ్రామ్ ఉప ఎన్నిక రేసు నుంచి సంచితా ప్రధాన్ డే తప్పుకోవడంతో మమతా బెనర్జీ వర్గం పోటీ నుంచి తప్పుకుంది. నందిగ్రామ్‎లో కాంగ్రెస్‎కు మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కాగా, 2026, అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.