Reading Time: 2 minutes
Pune Man Plans Malaysia Trip With Woman Friend Wife Finds Out After Passport Issue

భార్యకు తెలియకుండా ప్రియురాలితో ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అనుకున్న తడువుగానే ప్రణాళిక రచించాడు. అంతే వ్యాపారం నిమిత్తం మలేషియా వెళ్తున్నానని భార్యతో చెప్పి ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ప్రియురాలు కూడా సమయానికి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. ప్రియురాలి పాస్‌పోర్టు ఇరాకటంలో పడడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో భర్త భాగోతం బయటపడింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

పూణెకు చెందిన 46 ఏళ్ల వ్యాపారవేత్తకు భార్య ఉంది. అంతేకాకుండా మహిళా స్నేహితురాలు కూడా ఉంది. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు అన్నట్టుగా ఒకేసారి ఇద్దరిని మెయింటెన్స్ చేస్తున్నాడు. ఇక ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అంతే తడువుగా మలేషియా టూర్ ప్లాన్ చేశాడు. ఇంట్లో వ్యాపారం నిమిత్తం కౌలాలంపూర్ వెళ్లాల్సి వస్తుందని భార్యకు చెప్పి ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అలాగే ప్రియురాలు కూడా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చేసింది.

అయితే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో అతడితో ప్రయాణించాల్సిన స్నేహితురాలిని అధికారులు అడ్డుకున్నారు. ఆమె దగ్గర ఉన్న పాస్‌పోర్ట్‌ను గతంలో పోగొట్టుకున్నట్లు చెప్పింది. అయితే తాజా ప్రయాణంలో అదే పాస్‌పోర్ట్‌ను ఆమె ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమె అంతర్జాతీయ ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ప్రయాణం ఆగిపోయింది.

ఈ విషయం భార్యకు తెలిసిపోతుందని వ్యాపారవేత్త భయపడ్డాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు స్నేహితురాలిని నిలిపివేయడంతో చేసేదేమీలేక ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అనంతరం మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసి.. ప్రియురాలితో కలిసి దక్షిణ ముంబైలోని సెంట్రల్ రైల్వే ప్రధాన స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్లాడు. వెళ్లే ముందు విమానాశ్రయంలోని ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి తన భార్యకు ఫోన్ చేసి.. ఇమ్మిగ్రేషన్ సమస్య కారణంగా మొబైల్ ఫోన్‌ను అధికారులకు అప్పగించాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక మరుసటి రోజు భార్యతో కొద్దిసేపు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి.. తాను చెప్పిన కథనే మరోసారి చెప్పాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన భార్యకు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలోని సహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అయితే కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలుసుకున్న వ్యాపారవేత్త అదే రాత్రి సహార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ సమస్య అంటూ భార్యకు చెప్పినదంతా తాను కల్పించిన కట్టుకథ అంటూ పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో ప్రియురాలితో వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. భర్త భాగోతం బయటపడడంతో భార్య ఖంగుతింది.

ఈ ఘటనపై కేసును ముగించేందుకు కోర్టులో ‘సీ సమ్మరీ’ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. వాస్తవాలపై జరిగిన పొరపాటు కారణంగా కేసు నమోదైనప్పుడు లేదా ఫిర్యాదులోని ఆరోపణలు పూర్తిగా నిజమని, పూర్తిగా అబద్ధమని నిర్ధారించలేని సందర్భాల్లో ‘సీ సమ్మరీ’ వర్గీకరణను ఉపయోగిస్తారని పోలీసు అధికారి వివరించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.