
వచ్చే వారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు యూఎస్లో పర్యటిస్తున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజాలకు ఆహ్వానం అందింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
సెప్టెంబర్ 24న వైట్హౌస్లోని ఈస్ట్ రూమ్లో ట్రంప్, ఆయన సతీమణి మెలానియా.. జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్కు విందు ఇవ్వనున్నారు. ఈ విందులో ట్రంప్, జిన్పింగ్ ప్రారంభంలో ప్రసంగించనున్నారు.
టెక్ దిగ్గజాల క్యూ..
ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖేల్ డెల్ ఉన్నారు. ఆర్థిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ విందుకు హాజరయ్యే అవకాశం ఉంది.
ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగే చర్చల్లో కృత్రిమ మేధస్సు (AI) కీలక అంశంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాణిజ్యం, చైనా నుంచి ప్రపంచ మార్కెట్కు సరఫరా అవుతున్న రేర్ ఎర్త్ ఖనిజాలు కూడా చర్చకు రానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు.
జిన్పింగ్, పెంగ్ లియువాన్ సెప్టెంబర్ 23న వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకోనున్నారు. అక్కడే ట్రంప్ స్వయంగా జిన్పింగ్కు స్వాగతం పలకనున్నట్లు సమాచారం. విదేశీ దేశాధినేతకు అమెరికా అధ్యక్షుడు విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలకడం అరుదైన విషయంగా భావిస్తున్నారు. మరుసటి రోజు వైట్హౌస్లో ట్రంప్, మెలానియా అధికారికంగా జిన్పింగ్ దంపతులకు స్వాగతం పలుకుతారు. అనంతరం ట్రంప్, జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. అలాగే వైట్హౌస్ రోజ్ గార్డెన్లో జరిగే సైనిక సమీక్షలో ఇద్దరు నేతలు పాల్గొంటారు.
జిన్పింగ్ పర్యటనకు ముందు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్.. చైనా వైస్ ప్రీమియర్ హీ లైఫెంగ్తో న్యూయార్క్లో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో వాణిజ్యం, టారిఫ్లు, రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్ 10తో ముగియనున్న అమెరికా-చైనా టారిఫ్ సంధిని పొడిగించే అంశాన్ని కూడా ఇరు దేశాలు పరిశీలించనున్నాయి.
ఇక జిన్పింగ్ అమెరికా పర్యటన సెప్టెంబర్ 25న ముగియనుంది. ఆ రోజు ట్రంప్ దంపతులు జిన్పింగ్, పెంగ్ లియువాన్కు టీ విందు ఇవ్వనున్నారు. అనంతరం వారితో కలిసి నేషనల్ ఆర్కైవ్స్కు వెళ్లి అమెరికా వ్యవస్థాపక పత్రాలను వీక్షించనున్నారు. తర్వాత జిన్పింగ్, పెంగ్ లియువాన్ జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి చైనాకు తిరుగు ప్రయాణం కానున్నారు.