
- కొత్త డిస్కమ్లో ఉద్యోగులు చేరకుండా అడ్డుకునేందుకు పలువురి ప్రయత్నం
- రైతు డిస్కమ్ను ప్రైవేట్పరం చేస్తారని, జీతాలు రావని దుష్ప్రచారం
- ఉద్యోగుల ఆప్షన్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లే యోచన
- 45 సంఘాల వివరాలతో యాజమాన్యం కేవియట్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్లో ఉద్యోగులు చేరకుండా కొన్ని విద్యుత్ సంఘాల నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. రైతు డిస్కమ్ ను ప్రైవేట్ పరం చేస్తారని, ఆ డిస్కమ్ అప్పుల్లో కూరుకుపోతుందని, అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్కు ఇవ్వరని దుష్ర్పచారం చేస్తున్నట్లు రైతుడిస్కమ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది.
ఈ క్రమంలో ఇంధన శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినా కొందరి తీరు మారడం లేదని సమాచారం. పైగా ఉద్యోగుల ఆప్షన్లకు వ్యతిరేకంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు హైకోర్టుకు వెళ్లబోతున్నారని తెలిసిన యాజమాన్యం 45 సంఘాల వివరాలతో సోమవారం హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం విద్యుత్శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగులు చేరకుండా అడ్డుకునే ప్రయత్నం
రైతు డిస్కమ్పరిధిలోని కమర్షియల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అకౌంట్స్, ఐటీ విభాగం, రెగ్యులేటరీ.. తదితర విభాగాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాల్సి ఉంది. ఇందుకోసం టీజీ ట్రాన్స్ కో, జెన్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను పదోన్నతుల ద్వారా తీసుకోవాలని ఉన్నతాధికారులు గైడ్ లైన్స్జారీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 8వరకు గడువిచ్చారు.
ఇప్పటివరకు కేవలం 670 మంది ఉద్యోగులు మాత్రమే రైతుడిస్కమ్లో చేరడానికి అప్లయ్ చేసుకున్నారు. సోమవారం నాటికి నార్త్ డిస్కమ్ నుంచి 320, సౌత్ డిస్కమ్ నుంచి 253, జెన్కో నుంచి 71, ట్రాన్స్ కో నుంచి 26 మంది ఉద్యోగులు అప్షన్ ఇచ్చారు. ఉద్యోగుల నుంచి ఆశించినంత స్పందన లేకపోవడానికి కొందరు ఉద్యోగ సంఘాల లీడర్లే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి వచ్చింది.
దీంతో ఆయన ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే పలువురు ఉద్యోగ సంఘాల లీడర్లతో రెండు సార్లు సమావేశమై, వారి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. రైతు డిస్కమ్లో చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరపున ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందిస్తున్న విషయాన్ని వివరించారు. అయినప్పటికీ కొందరు లీడర్లు ఉద్యోగుల ఆప్షన్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లే సూచనలు కనిపించడంతో రైతు డిస్కమ్ యాజమాన్యం అలర్ట్ అయింది.
ఈమేరకు విద్యుత్ శాఖలో గుర్తింపు పొందిన 45 సంఘాల వివరాలను పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఒక వేళ ఎవరైనా రైతు డిస్కమ్కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని హైకోర్టును అభ్యర్థించింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరుపై విద్యుత్శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది.
విద్యుత్ శాఖలో 51 వేలకు పైగా ఉద్యోగులు
రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో ఇప్పటికే జెన్కో, ట్రాన్స్ కో, సౌత్, నార్త్ డిస్కమ్లు ఉండ గా, వీటి పరిధిలో 32,058 మంది రెగ్యులర్, 19,170 మంది ఆర్టిజన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా ‘రైతు డిస్కమ్’ను తెరపైకి తెచ్చింది. ఫ్రీ కరెంట్ఇచ్చే అగ్రికల్చర్ కనెక్షన్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి తదితర 29 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లను రైతు డిస్కమ్లోకి మార్చింది.
విద్యుత్ వినియోగాన్ని బట్టి, ఎస్పీడీసీఎల్ వాటా 71 నుంచి 45 శాతానికి, ఎన్పీ డీసీఎల్ వాటా 29 నుంచి13 శాతానికి పడిపోగా, రైతు డిస్కమ్ వాటా 42 శాతంగా తేలింది. ఇలా రెండో అతి పెద్ద విద్యుత్పంపిణీ సంస్థగా అవతరించిన రైతు డిస్కమ్ సేవలు జూన్ 2 నుంచి అధికారికంగా మొదలుకానున్నాయి. ఈక్రమంలో రైతు డిస్కమ్కు ఉద్యోగుల సర్దుబాటుపై సీఎండీ ముషారఫ్ అలీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు.