
- ధ్యంతర ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక అవసరాల కోసం ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కు కేటాయించిన భూములను లీజుకు ఇచ్చే అధికారం ఐడీపీఎల్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఔషధ పరిశ్రమ ప్రోత్సాహంలో భాగంగా పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన భూమిలోని భవనాలను లీజుకు ఇవ్వాలన్న నిర్ణయం చెల్లదని పేర్కొంది.
భూమిని స్వాధీనం చేసుకుంటూ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను నిలిపివేస్తూ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ బీఐఎఫ్ఆర్) 2008లో ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో బీఐఎఫ్ఆర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఔషధ పరిశ్రమను ప్రోత్సహించడానికి 1994లో రాష్ట్ర ప్రభుత్వం 891.38 ఎకరాల భూమిని బదలాయింపు ఒప్పందంతో కేటాయించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాలానగర్లోని పరిపాలనా భవనాన్ని లీజుకు ఇవ్వడానికి ఐడీపీఎల్ ప్రైవేటు కంపెనీల నుంచి అంచనాలను ఆహ్వానిస్తూ ప్రకటనలు జారీ చేసిందన్నారు.
ఐడీపీఎల్కు కేటాయించిన భూమిని కలెక్టర్ స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించాలని డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్కు 2008లో ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో ఈ భూమిని స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించారన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి.. ఐడీపీఎల్కు 1994లో కేటాయించిన 891.38 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించాలంటూ 2008 జనవరి 27న కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలంటూ బీఐఎఫ్ఆర్ 2008 ఫిబ్రవరి 6న ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నామన్నారు.