Reading Time: < 1 minute
Ap Govt Employees Get Big Boost Promotions For All Eligible Staff Announced

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్‌తో మంత్రి సమావేశమై, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించారు.

ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారంపై కూడా దృష్టి సారించారు మంత్రి పయ్యావుల.. ముఖ్యంగా 10/1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన సీనియారిటీ వివాదాలు కోర్టుల్లో ఉండటం వల్ల ఏర్పడిన అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సమస్యను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీనియారిటీ వివాదాల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా మంత్రి ప్రస్తావించారు. పదోన్నతుల్లో వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తంగా, ఈ నిర్ణయాలు అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, పరిపాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.