
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వారిలో ఆమని ఒకరు. స్టార్ హీరోయిన్ గా రాణించారు ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు ఆమని.. తాజాగా ఆమని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తోటి నటి సౌందర్యతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఎన్నో మంచి పాత్రలలో నటించానని, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించకపోయినా, బాపు, కే. విశ్వనాధ్, కే. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, కృష్ణారెడ్డి వంటి గొప్ప దర్శకులతో కలిసి పనిచేశానని ఆమని తెలిపారు. మంచి క్యారెక్టర్లు లభించడం దేవుడి దయగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎక్కువ మందితో స్నేహం చేయని, అంతగా కలవని ఆమని, తన ఏకైక సన్నిహిత స్నేహితురాలు నటి సౌందర్య అని వెల్లడించారు. తామిద్దరూ బెంగళూరుకు చెందినవారు కావడంతో, కన్నడ భాషపై ఉన్న ప్రేమతో ఒకరికొకరు దగ్గరయ్యారని వివరించారు.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
షూటింగ్లలో కన్నడ పాటలు పాడుకుంటూ, కన్నడలో మాట్లాడుకుంటూ స్నేహం బలపడిందని చెప్పారు. అన్నదమ్ముల అనుబంధం, అమ్మదొంగ వంటి నాలుగు-ఐదు చిత్రాలలో కలిసి నటించినట్లు ఆమని గుర్తుచేసుకున్నారు. సౌందర్య తన వ్యక్తిగత విషయాలను తనతో పంచుకునేదని, అదే విధంగా తాను కూడా సౌందర్యతో అన్ని విషయాలు మాట్లాడేదానిని ఆమని పేర్కొన్నారు. తాను వివాహం చేసుకున్న తర్వాత కూడా వారి స్నేహం కొనసాగిందని, సౌందర్య తల్లి తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవారని చెప్పారు. సౌందర్య తండ్రి మరణించినప్పుడు, రాత్రి పది గంటల సమయంలో సౌందర్య తనకు ఫోన్ చేసి ఏడ్చిందని, తనను వెంటనే వచ్చి కలవమని కోరిందని ఆమని గుర్తుచేసుకున్నారు. అప్పటికి తాను హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్కు వచ్చినా, వెంటనే కారు వేసుకుని ప్రశాంత్ కుటీర్కు వెళ్లినట్లు ఆమని తెలిపారు. ప్రశాంత్ కుటీర్ సౌందర్యకు చాలా సెంటిమెంట్ అని, ఎంత పెద్ద స్టార్ అయినా ఆమె అక్కడే ఉండేదని, తన రూమ్ మార్చేది కాదని తెలిపారు. అక్కడ తనను చూసి సౌందర్య చిన్నపిల్లలా ఏడ్చేసిందని, తమ కుటుంబంలో ఒక పిల్లర్ పోయిందని బాధపడిందని ఆమని చెప్పారు. ఆ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
సౌందర్య మరణ వార్త విన్నప్పుడు తాను షూటింగ్లో ఉన్నానని, ఆ వార్తను అస్సలు నమ్మలేకపోయానని ఆమని అన్నారు. ఎవరో తప్పు చెబుతున్నారని భావించానని, సౌందర్య ఎలా పోతుందని ప్రశ్నించానని ఆమె వివరించారు. కెమెరా ముందుండగానే సౌందర్య మరణ వార్త తెలియగానే, తనకు పక్కన మనుషులు ఉన్నారా లేదా అన్న స్పృహ లేకుండా ఏడ్చేశానని ఆమని పేర్కొన్నారు. అది తనకు పెద్ద షాక్గా మారిందని, ఆ సమయంలో దేవుడిని సౌందర్యను వదిలి తనను తీసుకెళ్లమని కోరుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య చాలా మంచి అమ్మాయని, ఎప్పుడూ ఎవరినీ విమర్శించదని, ఎవరిపైనా వ్యాఖ్యలు చేయదని ఆమని కొనియాడారు. అమ్మోరు వంటి మంచి సినిమాలు చేసిందని, కానీ మంచి జీవితాన్ని ఆస్వాదించలేకపోయిందని బాధపడ్డారు. సౌందర్యకు సినిమాపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, తన తండ్రి చెప్పారని మాత్రమే హీరోయిన్ అయిందని తెలిపారు. సామాన్య గృహిణిగా, కుటుంబ సభ్యులతో జీవితం గడపాలని సౌందర్య కోరుకునేదని, అలాంటి జీవితాన్ని అనుభవించకుండానే వెళ్లిపోవడం బాధాకరమని ఆమని అన్నారు.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.