Reading Time: < 1 minute
Summer Holidays 2026: బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు!

అమరావతి, ఏప్రిల్ 18: ఈ విద్యా సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు బడుల్లోని విద్యార్ధులందరికీ ప్రస్తుతం సమ్మెటివ్‌ ఎసెస్‌మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఏప్రిల్‌ 23వ తేదీని చివరి పని దినంగా ఇప్పటికే విద్యాశాక విద్యా క్యాలెండర్‌లో ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు రానున్నాయి. అనంతరం 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి మొదలవుతుంది. వేసవి సెలవుల తేదీలు ఖరారు కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు సొంత ఊళ్లకు పయనమయ్యేందుకు ట్రైన్‌, బస్సు టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు కూడా వెల్లడించాలని భావిస్తుంది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌ విద్యార్ధులకు ఏప్రిల్ 23 వరకు సెకండ్‌ ఇయర్‌ తరగతులు కొనసాగుతాయి. అనంతరం ఏప్రిల్ 24 నుంచి ఇంటర్ విద్యార్ధులకు కూడా వేసవి సెలవులు ఇస్తారు. అయితే జూన్‌ 1వ తేదీ నుంచే వీరికి కొత్త విద్యాసంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. జూన్‌ 1 నుంచి ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతాయి.

ఇక వేసవి సెలవు రోజుల్లో విద్యార్ధుల దినచర్యపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లనివ్వవద్దని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేయడం వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా వారిని ఉత్సాహంగా ఉంచాలని వివరించారు. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.