Reading Time: < 1 minute
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సూపర్ గుడ్‌న్యూస్.. స్థలం లేని వారికి డబుల్‌బెడ్‌రూమ్‌ల కేటాయింపు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే తొలిదశ పనులు వేగంగా సాగుతుండగా, తాజాగా స్థలం లేని నిరుపేదలకు సైతం ఇళ్లు అందించే లక్ష్యంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి, వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అయితే గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం18,816 డబుల్‌ బెడ్‌రూమ్‌ల ఇళ్లు మంజూరు కాగా అందులో సుమారు ప్రస్తుతం 10,353 ఇళ్ల నిర్మాణం పూర్తైంది. అయితే, లబ్ధిదారుల ఎంపిక జరగని 5 వేల ఇళ్లతో పాటు, అసంపూర్తిగా ఉన్న మరో 3,550 ఇళ్లను కలిపి మొత్తం 8 వేల పైచిలుకు ఇళ్లను ఇందరమ్మ పథకంలోని L2 కేటగిరికి చెందిన అంటే సొంత స్థలం లేని పేదలకు అప్పగించనున్నారు.

అయితే ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకే అప్పగిస్తోంది. పాత కాంట్రాక్టర్లతో ఉన్న అగ్రిమెంట్లను రద్దు చేసి వాటిని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించనుంది.ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయనుండి. లబ్ధిదారులే స్వయంగా పనులు చూసుకోవడం వల్ల నాణ్యత పెరగడంతో పాటు పనులు త్వరగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

అసంపూర్తి ఉన్న ఇళ్లను పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఈ పథకం కింద ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.