Reading Time: < 1 minute
Hyderabad: ఈజీ మనీ కోసం ఆశపడ్డాడు.. సీన్‌కట్‌చేస్తే.. అడ్డంగా బుక్కయ్యాడు..

నగరంలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతన్న నిందితుడిని మియాపూర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన గణపతిరాజు సత్యవాణి (65) అనే మహిళ ఏప్రిల్ 12వ తేదీ రోజు ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో హుడా పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్వస్తిక్ ఆసుపత్రి సమీపంలో పూజ కోసం పూలు కోయడానికి ఒక ఇంటి ముందు ఆగింది.

ఈ సమయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఒక వ్యక్తి ఆమె వెనుక నుంచి దాడి చేసి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా గొలుసును లాక్కొని మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో మహిళ మెడకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు సీసీ ఫుటేజ్, బైక్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించారు.

నిందితుడి కొత్తకోట గోవిందరావు (28)గా గుర్తించారు. ఇతను వృత్తి రీత్యా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతను దొంగిలించిన బంగారు గొలుసులను అమ్మి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఇతను మియాపూర్, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒక రోల్డ్ గోల్డ్ గొలుసును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.