PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

ఆదాయపు పన్ను నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తూ స్థిరాస్తి (Real Estate) కొనుగోళ్లలో పాన్ కార్డు సమర్పించాల్సిన కనీస పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటివరకు రూ.10 లక్షలు దాటిన ప్రతి ఆస్తి లావాదేవీకి పాన్ తప్పనిసరి కాగా.. మారిన నిబంధనల ప్రకారం ఆ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిర్ణయం తీసుకుంది.
నగరం లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు లేదా ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలు (JDA) చేసుకునే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుంది. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆస్తి కొనుగోళ్లతో పాటు ఇతర ఆర్థిక లావాదేవీల్లోనూ కీలక సవరణలు జరిగాయి. ఇదివరకు కార్లు కొంటే ధరతో సంబంధం లేకుండా పాన్ అడిగేవారు. ఇకపై ద్విచక్ర వాహనాలతో సహా ఏ మోటారు వాహనమైనా దాని ధర రూ.5 లక్షలు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా విత్ డ్రా చేసినా ఇకపై పాన్ వివరాలు సమర్పించాలి. హోటల్ బిల్లులు, రెస్టారెంట్లు లేదా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత కోసం ఇకపై ప్రతి పాలసీ కొనుగోలుకు పాన్ తప్పనిసరి చేశారు. ఈ మార్పుల వల్ల వ్యాపార లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా, ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండనుంది.