Reading Time: < 1 minute
Telangana Women Congress Chief Appointment Controversy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు మహిళా విభాగంలో చిచ్చు రేపింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించడంతో, ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న సునీతారావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

చాలా కాలంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, సునీతారావు తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు. తన హయాంలో మహిళా విభాగాన్ని యాక్టివ్‌గా ఉంచడంలో ఆమె సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాల్లో పేరుంది. అయితే, తాజాగా ఏఐసీసీ (AICC) ఎర్రబెల్లి స్వర్ణ పేరును ఖరారు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తనను, ప్రభుత్వంలో కనీసం ఒక పదవి ఇవ్వకుండా తొలగించడం అవమానకరమని సునీతారావు భావిస్తున్నారు.

సునీతారావు ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే, ఈ పదవికి జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు మేయర్‌గా ఉండి, పార్టీ మారిన విజయలక్ష్మికి వెంటనే కీలక పదవి ఇవ్వడంపై సునీతారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ, తనకు కేవలం కమిషన్ మెంబర్ పదవి ఇవ్వజూపడంపై ఆమె ఒక సీనియర్ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణకు ఇది పూలపాన్పు ఏమీ కాదు. ప్రస్తుతం పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను చక్కదిద్దడం ఆమె ముందున్న మొదటి సవాలు. పదవుల భర్తీ విషయంలో మహిళా నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి, అందరినీ కలుపుకొని పోవాల్సిన గురుతర బాధ్యత ఆమెపై ఉంది. ముఖ్యంగా సునీతారావు వంటి సీనియర్లను బుజ్జగించి, వారి సహకారం పొందేలా చేయడంలోనే ఆమె సక్సెస్ ఆధారపడి ఉంది.

PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..