July 9, 2026

Discount on Gold: యుద్ధం ఎఫెక్ట్.. భారీ డిస్కౌంట్‌పై బంగారం అమ్ముతున్న వ్యాపారులు..

Discount on Gold: యుద్ధం ఎఫెక్ట్.. భారీ డిస్కౌంట్‌పై బంగారం అమ్ముతున్న వ్యాపారులు..
Reading Time: 2 minutes
War Impact On Gold Market Dubai Traders Selling Gold At Heavy Discount

Discount on Gold: ఇరాన్-ఇజ్రాయెల్‌, యూఎస్‌ యుద్ధంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. అయితే, ఇది ప్రపంచ బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో దిగుమతి-ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ పరిస్థితుల ప్రభావం బంగారం వ్యాపారంపై కూడా పడింది. ప్రస్తుతం అనేక బంగారు షిప్‌మెంట్‌లు దుబాయ్‌లో నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. United Arab Emirates వైమానిక ప్రాంతం కొంతకాలం మూసివేయబడటం వల్ల బంగారం రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో అనేక ఎగుమతిదారులు తమ బంగారం సరుకులను సమయానికి పంపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రవాణాలో జాప్యం కారణంగా నిల్వ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయడానికి దుబాయ్ వ్యాపారులు బంగారాన్ని తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం ప్రకారం, లండన్ బెంచ్‌మార్క్ ధర కంటే ఔన్సుకు సుమారు 30 డాలర్లు తక్కువగా బంగారం అమ్ముతున్నారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం 10 గ్రాములకు దాదాపు రూ.900 వరకు తగ్గింపుగా భావించవచ్చు. కాగా, ప్రపంచ బంగారం వ్యాపారంలో దుబాయ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆసియా దేశాలకు బంగారం సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఇది నిలిచింది. ముఖ్యంగా Switzerland, United Kingdom మరియు కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం ఇక్కడి నుంచి మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఇరాన్‌కు సంబంధించిన భద్రతా పరిస్థితులు మరియు గగనతల పరిమితులు ఈ రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.

ఇక, భారత్‌ విషయానికి వస్తే, దుబాయ్ నుంచి బంగారం దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలలో భారత్ ఒకటి. అయితే ప్రస్తుతం దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున తక్షణ ప్రభావం కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఈ పరిస్థితి మరికొన్ని నెలలు కొనసాగితే దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, దేశీయ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.62 లక్షల వద్ద ఉండగా, ఒక కిలో వెండి ధర రూ.2.68 లక్షలకుపైగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. అయితే డాలర్ బలపడటం మరియు యుద్ధ పరిస్థితుల వల్ల మార్కెట్‌లో కొంత అస్థిరత కొనసాగుతోంది.