Reading Time: < 1 minute
Khammam: అమ్మతో దిగిన చిన్నప్పటి ఫోటోపై ఆ మాట రాసి.. అనంత లోకాలకు..

ఖమ్మం కవిరాజ్ నగర్‌లో విషాదం నెలకొంది. డిగ్రీ విద్యార్థిని సృజన (18) ఆత్మహత్య చేసుకుంది. తల్లి అనారోగ్యంతో బాధ పడుతోంది. తండ్రి మృతితో కుంగిపోయిన విద్యార్థిని జీవతాన్ని చాలించింది. ఇప్పటికే నాన్నను కోల్పోయి ఇద్దరం ఇబ్బందిపడుతున్నాం. అమ్మా నీ కంటే ముందే నేను.. ఆ తర్వాత అమ్మను నువ్వు చూసుకోవాలి మామయ్య..  అంటూ తరచూ చెప్పే మాటలనే ఆ విద్యార్థిని నిజం చేసింది. తల్లితో తాను చిన్నప్పుడు దిగిన ఫొటోపై ‘అయామ్ సారీ అమ్మా’ అని రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్‌లో ఈ ఘటన జరిగింది.

బట్ల సృజన (18) ఖమ్మం లోని ఎస్ ఆర్ బీజీఎన్ఆర్ కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. ఆమె తండ్రి కనకరాజు కొన్ని సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినప్పటి నుంచి కుటుంబం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఆమె తల్లి మేరీ పద్మ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆస్పత్రిలో తల్లిని చూసి వచ్చిన సృజన భవిష్యత్‌పై ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అమ్మ అనారోగ్య పరిస్థితిపై ఒత్తిడికి గురై.. ఇంట్లోనే ఫ్యాను కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనతో స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మరిన్నితెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.