
New Shoes Dispute: కొత్త షూస్ వేసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం.. ఆ తర్వాత సీరియస్గా మారి తమ్ముడి హత్యకు దారి తీసింది.. Uttar Pradeshలోని Maharajganj Districtలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య మొదలైన చిన్న వివాదం చివరకు ఘోర విషాదానికి దారితీసింది. ఆగ్రహానికి గురైన అన్న తన తమ్ముడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
సమాచారం ప్రకారం, ఘుగ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌముఖ గ్రామం నౌకా టోలాలో ఈ ఘటన జరిగింది. సూరజ్ శర్మ అనే యువకుడు ఆన్లైన్లో కొత్త బూట్లు ఆర్డర్ చేశాడు. అయితే, వాటిని ముందుగా తానే వేసుకుంటానని తమ్ముడు లక్ష్మణ్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. చిన్న మాటల తగవు క్రమంగా పెద్ద గొడవగా మారింది. కోపోద్రిక్తుడైన సూరజ్, ఇంట్లో ఉన్న కత్తెర తీసుకుని తమ్ముడు లక్ష్మణ్పై దాడి చేశాడు. తలపై, చేయిపై పలుమార్లు దాడి చేయడంతో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు.
ఘటనతో ఇంట్లో అరుపులు, ఏడుపులు మార్మోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన లక్ష్మణ్ను సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయగా, అక్కడికి చేరుకునేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామస్తులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న విషయానికి ఇంత పెద్ద విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు. క్షణిక కోపం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసి, అన్నను హంతకుడిగా మార్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.