Reading Time: < 1 minute
అమ్మో నిమ్మ..! ఇటు కొనలేం.. అటు తాగలేం.. ఎండల్లో మండిపోతున్న ధరలు.. కేజీ ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు గక్కుతున్నాడు. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడి ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు.. ఈ క్రమంలో.. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా పండ్ల రసాలతో పోలిస్తే.. నిమ్మరసం కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసాన్ని ఆశ్రయిద్దామనుకుంటే.. అక్కడ ధరలు చూసి సామాన్యుడికి గుండె గుభేల్ అంటోంది. గత కొద్ది రోజుల క్రితం వరకు పాతాళంలో ఉన్న నిమ్మకాయ ధరలు.. ఒకేసారి ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో నిమ్మకాయల ధర ఏకంగా 300 రూపాయలకు చేరడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. చాలా జిల్లాల్లో కేజీ నిమ్మకాయ ధరలు 250 నుంచి 300 లకు పైగా పలుకుతున్నాయి. ఎండలు మండుతున్నాయి.. గొంతు ఎండుతోంది.. కానీ దప్పిక తీర్చుకుందామంటే నిమ్మకాయ ధరలు భయపెడుతున్నాయని సాధారణ ప్రజానీకం పేర్కొంటున్నారు.

అటు ఎండల తీవ్రత పెరగడం, ఇటు శుభకార్యాల సీజన్ కావడంతో నిమ్మకాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్‌లో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి..నిన్న మొన్నటి వరకు కిలో 30 రూపాయలు కూడా పలకని నిమ్మకాయ.. నేడు ఏకంగా 300 రూపాయల మార్కును తాకింది.. చిన్నపాటి నిమ్మకాయను కూడా ఒక్కొక్కటి 10 రూపాయలకు విక్రయిస్తుండటం గమనార్హం.. గతంలో కిలో లెక్కన కొనే సామాన్యుడు. ఇప్పుడు లెక్కపెట్టి కాయలను కొనే పరిస్థితి వచ్చింది.

గత నెలలో ధరలు దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ఇప్పుడు డిమాండ్ పెరిగినా సామాన్యుడికి మాత్రం అది భారంగా మారింది. ఇక శుభకార్యాల సీజన్ కావడంతో నిమ్మకాయల వినియోగం అనివార్యమైంది. అయితే.. పెరిగిన ధరల వల్ల ఫంక్షన్లు చేసేవారు కూడా నిమ్మకాయల వాడకాన్ని తగ్గించుకుంటున్నారు. హోటళ్లు, జ్యూస్ సెంటర్ల యజమానులు సైతం ధరల పెరుగుదలతో కస్టమర్ల నుంచి అధిక ధరలు వసూలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు.

మొత్తానికి నిమ్మకాయ సామాన్యుడికి అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో.. నిమ్మ ధరలు మరిన్ని రికార్డులు సృష్టిస్తాయో లేక అదుపులోకి వస్తాయో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..