
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్పై కీలక విజయాన్ని సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వంటి కఠినమైన వేదికపై గెలవడం ఎప్పుడూ సవాలేనని, కానీ ఈసారి జట్టు సమిష్టిగా మంచి క్రికెట్ ఆడిందని తెలిపాడు. ఈ విజయం ముంబై జట్టుకు ఎంతో అవసరమని, అందుకే మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. మ్యాచ్లో 14వ ఓవర్ టైమ్అవుట్ తర్వాత గట్టిగా అరిచానని, ఆ సమయంలో తల తిరిగిందని హార్దిక్ చెప్పుకోచ్చాడు. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయాల అనంతరం ముంబై విజయం సాధించింది.
‘చాలా ముఖ్యమైన విజయం ఇది. బయటి మైదానాల్లో గెలవడం ఎప్పుడూ సవాలే. ముఖ్యంగా అహ్మదాబాద్లో ముంబై ఇండియన్స్కు గెలుపు చాలా కష్టం. కానీ ఈరోజు మేము మంచి క్రికెట్ ఆడాం. ఈ విజయం చాలా అవసరం, అందుకే ఇది మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. టైమ్అవుట్ సమయంలో నేను తిలక్ గురించి ఆలోచించాను. అతనిలో ఉన్న ప్రతిభను చూస్తే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అతనికి చెప్పింది ఒక్కటే.. ఏం జరిగినా బాల్ను గమనించి, బలంగా కొట్టు అని. తిలక్ బ్యాటింగ్ స్ట్రైకింగ్ అద్భుతం. ఇలాంటి ఇన్నింగ్స్ అతనికి కొత్త కాదు. టైమ్అవుట్లో కొన్ని సార్లు చాలా గట్టిగా చెప్పాను. దాంతో నాకు తల తిరిగినట్టే అయింది (నవ్వుతూ). ఈ ఇన్నింగ్స్ జట్టుకు, తిలక్కు, ముంబై ఇండియన్స్కు చాలా అవసరం. కెప్టెన్గా కూడా ఇలాంటి ఎనర్జీ చాలా మార్పు తీసుకొస్తుంది’ అని హార్దిక్ తెలిపాడు.
Also Read: Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘చాలామంది బుమ్రా ఎందుకు మొదటి ఓవర్ వేయడు? అని అడుగుతుంటారు. బుమ్రా ఇప్పటికే చాలా మ్యాచ్లు ఆడాడు. అందులో కొన్ని సార్లు మాత్రమే తొలి ఓవర్ వేశాడు. ఇది హార్దిక్ సమస్య కాదు. బుమ్రా ఎంతో ప్రత్యేకమైన బౌలర్. జట్టుకు అవసరమైనప్పుడు ఎక్కడైనా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొత్త బంతితో ప్రభావం చూపాలనుకున్నాం, అందుకే అతడికి బంతిని ఇచ్చాను. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. జట్టుకు ఈ ఎనర్జీ చాలా అవసరం. డెబ్యూ చేసిన క్రిష్ బాగా బౌలింగ్ చేశాడు. అశ్వని అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. గతంలో కూడా అతడు మ్యాచ్ మోమెంటమ్ మార్చాడు. ఫీల్డింగ్ కూడా బాగుంది. నమన్ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఈ విజయం మాకు మలుపు అవుతుంది’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.