
ఎండాకాలం వచ్చిందంటే చాలు..చల్లచల్లగా కూల్ డ్రింక్స్.. నిమ్మరసం, తాగాలనిపిస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోడానికి నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. అందుకే చాలామంది మొదటి ప్రాధాన్యత దీనికే ఇస్తారు. శరీరానికి విటమిన్ సి అందిస్తూ, ఇన్స్టంట్గా ఎనర్జీని ఇచ్చే ఈ డ్రింక్ వేసవిలో ఒక వరప్రసాదం లాంటిది. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం.. అతిగా తీసుకుంటే అనర్ధమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డిటాక్స్ పేరుతో చాలామంది నిమ్మరసాన్ని అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నాయి తాజా పరిశోధనలు. పరిశోధనల ప్రకారం…నిమ్మరసం అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కడుపులో ఆమ్ల స్థాయిలను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పరగడుపున నిమ్మరసం తాగితే కడుపులో మంట, వికారం, ఎసిడిటీ వంటివి తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది అల్సర్లకు దారితీయవచ్చు. నిమ్మరసం అధికంగా తాగడం వల్ల కాల్షియం శోషణపై ప్రభావం పడి ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది. అలాగే, దీనిలోని ఆమ్ల గుణం దంతాల పైపొర ను కరిగించి, పళ్లు జివ్వుమనే సమస్యకు దారితీస్తుంది. అలాగే నిమ్మరసానికి ‘ఫోటో సెన్సిటివిటీ’ని పెంచే గుణం ఉంటుంది. ఇది ఎక్కువగా తాగిన వారు ఎండలోకి వెళ్తే, సూర్యరశ్మి ప్రభావానికి చర్మంపై దద్దుర్లు, దురద, ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిమ్మరసం రోజుకు ఒకటి, రెండు గ్లాసులకు మించకూడదు. పరగడుపున తాగడం కంటే భోజనం తర్వాత తాగడం మంచిది. ఆమ్ల ప్రభావాన్ని తగ్గించడానికి నిమ్మరసంలో కొద్దిగా తేనె కలుపుకోవడం ఉత్తమం. అలాగే, తాగిన వెంటనే మంచి నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు