ఫ్రిజ్లో పెట్టిన పుచ్చకాయ: చాలామంది పుచ్చకాయను బయట నుంచి తెచ్చిన వెంటనే ముక్కలు కోసి, చల్లబడాలని ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. కోసిన పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచడం వల్ల అందులోని సహజమైన పోషకాలు నశించి, దాని గుణాలు మారిపోతాయి. కోసిన పండుపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది కడుపునొప్పికి దారితీస్తుంది. పుచ్చకాయను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచి తినాలి. ఒకవేళ మిగిలిపోతే గాలి చొరబడకుండా మూత పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలి.
తిన్న వెంటనే నీళ్లు తాగడం: పుచ్చకాయలో సహజంగానే దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలచబడి, ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీటికి దూరంగా ఉండటమే ఉత్తమం.
మోతాదు మించితే ముప్పే: ఏదైనా అతిగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని కిలోల కొద్దీ తినకూడదు. ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒక చిన్న గిన్నెడు ముక్కలు లేదా 2 నుండి 3 పెద్ద ముక్కలు తింటే సరిపోతుంది. ఒక మధ్యస్థ పరిమాణపు పుచ్చకాయ ఒక కుటుంబంలో నలుగురికి సరిపోతుంది. అంతకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు.
గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే నల్ల ఉప్పు: పుచ్చకాయ తిన్న తర్వాత కొందరికి కడుపు భారంగా అనిపించడం సహజం. ఇలాంటి వారు ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు చల్లుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ వేగవంతం కావడానికి సహకరిస్తుంది.
పండు ఎంపికలో జాగ్రత్తలు: బయట దొరికే కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను కొనకపోవడం మంచిది. అలాగే పండుపై రంగు కోసం ఇంజెక్షన్లు ఇచ్చే ముప్పు ఉన్నందున, నమ్మకమైన చోట కొనాలి. పండు కోసిన తర్వాత నీరు కారుతున్నా లేదా వాసన వస్తున్నా దానిని తినకూడదు. వేసవిలో పుచ్చకాయ శరీరానికి అద్భుతమైన చలవను ఇస్తుంది. కానీ ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం దాని పూర్తి ప్రయోజనాలను పొందగలం.




