Reading Time: < 1 minute

రష్యా ఉపగ్రహాలతో ఇరాన్‌కు నిఘా సాయం.. నిలువరించకపోతే తీరని నష్టం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

Caption of Image.

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు. రష్యా, ఇరాన్ దేశాల మధ్య ప్రమాదకర సైనిక సహకారం జరుగుతోందని ఉక్రెయిన్ అన్నారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా ఉపగ్రహాల ద్వారా నిఘా సమాచారాన్ని సేకరించి ఇరాన్‌కు చేరవేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ముప్పును వెంటనే నిలువరించకపోతే ప్రపంచ శాంతికి తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

 జూలై ప్రారంభం నుంచి గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా శాటిలైట్లు చురుగ్గా నిఘా పెట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.  రష్యా తీస్తున్న ఈ ఉపగ్రహ చిత్రాలు, ఇరాన్ జరిపే దాడులకు ముందు టార్గెట్లను గుర్తించడానికి, దాడుల తర్వాత నష్టాన్ని అంచనా వేయడానికి స్పష్టంగా ఉపయోగపడుతున్నాయని జెలెన్ స్కీ చెబుతున్నారు.  

జూలై 19, 20 తేదీల్లోనే నాలుగు కీలక వైమానిక స్థావరాలు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ లపై రష్యా ఉపగ్రహాలు నిఘా పెట్టినట్లు జెలెన్ స్కీ చెప్పారు. రష్యా- ఇరాన్ రహస్య మద్దతును అడ్డుకోవడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను ఉక్రెయిన్ భాగస్వామ్య దేశాలకు అందజేస్తుందని తెలిపారు.  మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

©️ VIL Media Pvt Ltd.